ఆస్పత్రికి వెళ్లకుండానే వైద్యం... !

Telugu Lo Computer
0


సాధారణంగా ఏదైనా అనారోగ్యానికి గురైన ఆస్పత్రికి వెళ్తాం. పట్టణాల్లో ఓకేగానీ.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కాస్త కష్టమే. అక్కడ చాలా వరకు ఆర్ఎంపీలే దిక్కు. కాస్త సీరియస్ అయితే మాత్రం సమీపంలోని పట్టణప్రాంతానికి వెళ్లాలి. ఐతే కరోనా పుణ్యమా అని టెలీమెడిసన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి వైద్యుల సూచనలు సలహాలు తీసుకోవచ్చు. ఇప్పుడు దానిని కాస్త అప్ డేట్ చేసి వీడియో కాల్ ద్వారా డాక్టర్ కన్సల్టేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లను భాగస్వామ్యం చేయనుంది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి సొంతూరికి లేదా సొంత రాష్ట్ర ప్రజలకు సేవలు చేయాలనుకునే డాక్టర్లకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. తక్కువ బ్యాండ్‌ విడ్త్‌ ఉన్నా, వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యులతో కన్సల్టెన్సీ సేవలను అందించే విధంగా ప్రత్యేక యాప్‌ను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎస్‌) అభివృద్ధి చేసింది. ఒక్కసారి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఇంటర్నెట్‌ వేగం తక్కువగా ఉన్నా వీడియో కాన్ఫరెన్స్‌ ఎంపిక చేసుకున్న డాక్టర్‌తో వైద్య సేవలను, ఈ ప్రిస్కిప్షన్‌ను పొందవచ్చు.

యాప్ ను వినియోగించడం తెలియని వారు కూడా దీని ద్వారా నిపుణులైన డాక్టర్లను సంప్రదించి వైద్య సాయం పొందవచ్చు. ఇలాంటి వారు గ్రామాల్లో ఉండే విలేజ్ క్లినిక్ కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్లతో మాట్లాడవచ్చు. ఇందుకోసం ఆర్‌ఎక్స్‌ టెలికేర్‌ సంస్థతో ఏపీటీఎస్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ యాప్ ను పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

ఇప్పటికే అమెరికా వంటి పలు దేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్‌ఎక్స్‌ టెలీకేర్‌లో 200 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు. ఒక్కసారి యాప్‌లో పేరు నమోదు చేసుకొని, కాల్‌ చేస్తే పేషెంట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని స్పషలిస్టుకు రిఫర్ చేసి అపాయింట్ మెంట్ ఖరారు చేస్తారు. ఆ సమయంలో ఇంట్లో నుంచి గానీ, విలేజ్ క్లీనిక్ నుంచి గానీ డాక్టర్ తో మాట్లాడి ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు. ప్రిస్క్రిప్షన్ కూడా అప్పుడే ఇస్తారు. అలాగే రోగి బంధువులతో కలిసి గ్రూప్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు గాయాలు, ఇతర సమస్యలకు సబంధించిన ఫోటోలు సేకరించి సేవ్ చేసోవచ్చు. ఈ సమాచారాన్ని క్లౌడ్ లో స్టోర్ చేస్తారు. దీనికి ఫాలో అప్ ట్రీట్ మెంట్ కూడా ఇస్తారు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే జబ్బులకు ఈ డేటాను ఆధారంగా చేసుకొని చికిత్స ఇస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)