బీహార్ రాష్ట్రం నలంద జిల్లా మాధోపూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామా మహతోని శనివారం రాత్రి ఒక పాము కాటేసింది. దాంతో కోపంతో ఊగిపోయిన మహతో ఆ పాముని వెంటాడి పట్టుకున్నాడు. పరపర కొరికి చంపేసి ఇంటి పక్కనే ఉన్న చెట్టుపై వేలాడదీశాడు. మహతో పాముని కొరికి చంపడం గమనించి కొందరు గ్రామస్తులు ఆశ్చర్యపోయి, అలా చేయొద్దని అతడిని వారించారు. అయినా మహతో వారి మాట వినకుండా తన పని తాను చేశాడు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమని గ్రామస్తులు బతిమిలానా పట్టించుకోలేదు. 'పాముని చంపేశాను కదా.. నాకేం కాదులే' అని చెప్పి వారి హెచ్చరికలు పెడచెవిన పెట్టాడు. తర్వాత భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు మహతో. తెల్లవారుజామున కుటుంబసభ్యులు చూడగా మహతో స్పృహ తప్పి పడి పోయి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, మహతో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లునిర్ధారించారు.