కిషోర్ కుమార్

Telugu Lo Computer
0


కిషోర్ కుమార్ ఆగష్టు 4, 1929 న ఖాండ్వా గ్రామంలోని బెంగాలీ కుటుంబంలో జన్మించారు. అతని అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ. అతని తండ్రి కుంజలాల్ గంగూలీ (గంగోపాధ్యాయ్) న్యాయవాది, అతని తల్లి గౌరీ దేవి ధనికులైన బెంగాలీ కుటుంబానికి చెందినది. కుంజలాల్ గంగోపాధ్యాయ కమవిశాదర్ గోఖలే కుటుంబానికి వ్యక్తిగత న్యాయవాదిగా ఉండేవారు.  కిషోర్ తన సహోదరులలో చిన్నవారు. అతని కన్నా పెద్దవారు అశోక్ కుమార్, సతీదేవి, అనూప్ కుమార్. అతను బాల్యంలో ఉన్నప్పుడే తన సోదరుడు అశోక్ కుమార్ బాలీవుడ్ నటునిగా ఉన్నారు. తరువాత అనూప్ కూడా సినిమారంగంలోకి అడుగుపెట్టారు. అశోక్ కుమార్, అనూప్ కుమార్ లకు ముద్దుల తమ్ముడిగానే, బొంబాయి చిత్ర రంగంలో కిషోర్ అడుగు పెట్టారు. అతను ఇండోర్ లోని క్రిస్టియన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసారు.

1948లో తొలిసారిగా ఫిల్మిస్థాన్ వారి "షికారి" చిత్రంలో చిన్న పాత్ర వేశారు. అదే ఏడాది బాంబే టాకీస్ వారి "జిద్ది"లో తోటమాలి పాత్ర వేశారు. ఈ చిన్న పాత్రలు గుర్తింపు రాలేదు కానీ, "జిద్ది"లో హీరో దేవానంద్ కు పాడిన నేపథ్య గీతాలు పదిమందినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రిమ్‌జిమ్ (1949) లో రెండు పాటలూ, ప్రముఖ దర్శకుడు ఎన్.డి.బర్మన్ అధ్వర్యంలో "ప్యార్" (1950) లో హీరో రాజ్‌కపూర్ కు అన్ని పాటలూ పాడటంతో కిషోర్ గాన విశిష్టత అందరికీ తెలిసింది.

నౌజవాన్, బాజీ, బహార్ చిత్రాలలో నేపథ్య గీతాలు, ఆందోళన్, బహార్ చిత్రాలలో నటన - కిషోర్ ను గాయక, నటునిగా స్థిరపరిచాయి. 1950 ప్రాంతంలో తమ పాత్రలకు తామే పాటలు పాడే కామెడీ పాత్రలలోనే నటనా సామర్థ్యం అత్యద్భుతంగా నిర్వహించే అరుదైన నటుడుగా కిషోర్ కీర్తిమంతుడయ్యారు. హేమంతకుమార్, మన్నా డే, రఫీ, తలత్ మహమ్మద్, జి.ఎం.దురానీ వంటి ఉద్ధండులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను, మరపురాని స్థానాన్ని రూపొందించుకోగలిగారు. శాస్త్రీయ సంగీతం నుండి రాక్ ఎన్‌రోల్ పాటల దాకా సమప్రజ్ఞతో పాడగల మహ్మద్ రఫీ, ముకేష్ లు కూడా ప్రారంభంలో సైగల్ ను అనుకరించి, ఆ తర్వాత స్వంత శైలిని ఏర్పరచుకున్నారు. జానపద గేయాలను, శాస్త్రీయ గీతాన్ని కూడా అధ్బుతంగా పాడే తలత్ మొహమ్మద్, మాధుర్యం నిండిన హేమంత్ కుమార్ గళం వీరందరికీ ఒక అడుగు ముందుకు వేసి రవంత చిలిపితనం కూడా జోడించిన కిషోర్ హిందీ చిత్ర సంగీతాన్ని స్పీడ్ యుగం లోకి నడిపించుకువచ్చారు.

ఆశోక్ కుమార్ హిందీ చిత్రసీమలో నటునిగా చేరిన తరువాత గంగూలీ కుటుంబం తరచుగా ముంబై సందర్శించేవారు. అభాస్ కుమార్ తన పేరును "కిషోర్ కుమార్" గా మార్చుకున్నారు. తరువాత అతను తన సోదరుడు పనిచేసే ముంబై టాకీస్ వద్ద కోరస్ గాయకునిగా సినీప్రస్థానం మొదలుపెట్టారు. తన సోదరుడు కీలక పాత్ర పోషించిన చిత్రం శిఖారీ (1946) ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. సంగీత దర్శకుడు ఖేమ్‌చంద్ ప్రకాష్ తన చిత్రం జిడ్డి (1948) లో "మర్నే కీ దుయాయెన్ క్యోం మంగు" అనే పాట పాడడానికి అవకాశం కల్పించారు. తరువాత అతనికి అనేక సినిమాలలో అవకాశం వచ్చింది. 1949లో ముంబైలో స్థిరపడ్డారు."ఫణి మజుందార్" దర్శకత్వంలో నిర్మించబడిన బొంబాయి టాకీస్ చిత్రం "ఆందోళన్ (1951)" లో ముఖ్యపాత్రలో నటించారు. తన సోదరుని సహాయం ద్వారా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ  తాను గాయకుడు గావాలనే అభిలాష ఉండేది. కానీ అశోక్ కుమార్ తనలాగే నటునిగా ఉండాలని కోరుకునేవారు. 1946 - 1955 మధ్య అతను 22 సినిమాలలో నటించారు. అందులో 16 సినిమాలు విజయం సాధించలేకపోయాయి. లడకీ, నౌకరీ, మిస్ మలేసియా, చార్ పైసే, బాప్ రె బాప్ చిత్రాల విజయం తరువాత అతను నటనాజీవితంపై ఆసక్తిని పెంచుకున్నారు. 1955 నుండి 1966 మధ్య కాలంలో మంచి నటునిగా గుర్తింపు పొందారు.

తన వృత్తి జీవిత ప్రారంభంలో అతను గాయకుడు కె.ఎల్.సైగాల్ ద్వారా ప్రభావితుడై అతని శైలిలో కొన్ని చిత్రాలలో పాటలు పాడారు. అతనికి కవి, సంగీతకారుడైన రవీంద్రనాధ టాగూరు పై ఉన్న గౌరవం అతన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది.

అతను హాలీవుడ్ నటుడు-గాయకుడు డానీ కాయే కు గొప్ప ఆరాధకుడు. అతను తన గౌరీకుంజ్ నివాసంలో ఈ ముగ్గురు చిత్రాలను ఉంచి ప్రతీరోజూ వారిపై గౌరవం కనబరచేవారు. తరువాత కాలంలో అతను నేపధ్యగాయకుడు అహ్మద్ రుష్ది కి ప్రభావితుడైనారు. అతను లండన్ లోణి రాయల్ ఆల్బర్డ్ హాల్ లో రుష్దీ పాడిన పాటలను పాడడం ద్వారా అతనికి నివాళి అర్పించారు.

అతను తను పాడిన పాటలు "తుం బిన్ జావో కహా", "జిందగీ ఏక్ సఫర్ నై సుహానా", " చలా జాతా హూ" మొదలైన పాటలలో యోడెలింగ్ శైలిని ఉపయోగించాడు. ఈ ప్రక్రియ జిమ్మీ రోడ్జెర్స్, టెక్స్ మార్టిన్ ద్వారా ప్రేరణ పొందిన అతని గానం యొక్క ముఖ్య లక్షణంగా మారింది.

అధికార్ (1954), చప్‌రే చాప్ (1955), న్యూఢిల్లీ, భాగం భాగ్, భాయ్ భాయ్ (1956) చిత్రాలలోనటునిగా, మిస్ మాలా, నౌక్రీ, ముసాఫిర్ చిత్రాలలో విషాంత రేఖలు వున్న హాస్యనటుడిగా స్థిరపడిన కిషోర్ 1958 లో, "చల్తీకా నాం గాడీ" చిత్రంలో తారాస్థాయి అందుకున్నారు. ఈ చిత్రంలో కిషోర్ పాడిన పాటలు ఈ నాటికీ మారు మ్రోగుతున్నాయి. అశోక్, అనూష్, కిషోర్ కుమార్ లు మువ్వురూ అన్నదమ్ములూ నటించిన చిత్రం కూడా అదే. "జిద్ది" (1948) లో దేవానంద్ కు డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ తరహాలో నటుడుగా, హాస్య పాత్రధారిగా, గాయకుడుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుని, చిత్ర రంగంలో స్థిరపడిన తరుణంలో 1961 లో కొత్త అవతారమెత్తారు. "ఝమ్రూ" సినిమాకు సంగీత దర్శకత్వం, పాటల రచన మొదలైన అదనపు బాధ్యతలు చేపట్టారు. అంతటితో ఆగలేదు. "కొషోర్ ఫిలిమ్స్" బ్యానర్ కింద సినిమా నిర్మాణం చేపట్టి, తాను డైరక్ట్ చేయడం, సంగీత దర్శకత్వం చేపట్టడం, పాటలు రాయడం, నటించడం, వీలయినంతమేరకు ఇతర సాంకేతిక బాధ్యతల్ పర్యవేక్షణ చేయడం ప్రారంభించారు. మొదటి చిత్రం "దూర్ గగన్ కీ ఛాఁవ్ మేఁ", ఆ తర్వాత "హమ్‌ దో డాకూ" (1967), దూర్ కారాహి (1969), "బడ్‌తీ కా నామ్‌ దాడీ", "శభాష్ డాడీ" (1978) చిత్రాలు చెప్పుకోదగినవి.

“ రుక్ జానా నహీఁ తూ కహీఁ హార్‌కే

కాంటోఁ పే చల్‌కే మిలేంగే సాయే బహార్ కే...

ముసాఫిర్‌ హూఁ యారో...న ఘర్‌హై , నా ఠికానా

ముఝే చలతే జానా హై

హంస్‌తే గాతే యహాఁ సే గుజర్

దునియాకీ తూ పర్‌వా నకర్.... ”

ఈ పదాల కలయికలో ఎంత భావమున్నదో కిషోర్ జీవితంలో అంతకంటే ఎక్కువ గాఢమైన వ్యధ ఉంది. ఏ పరిస్థితులలోనూ రాజీ పడలేదు. ఊపిరి పీల్చినంతకాలమూ దర్జాగా నవ్వుతూ, నవ్విస్తూ కాలం గడిపారు. కిషోర్ వ్యక్తిత్వాన్ని 90 శాతం గ్రహించిన వాళ్ళూ ఇద్దరే ఉన్నారు. ఆయన నలుగు భార్యల్లో రెండవ భార్య మధుబాల, నాల్గవ భార్య లీనా చందావర్కర్. మధుబాలను కిషోర్ స్వప్న దేవతగా పేర్కొనవచ్చు. ఆమెను దృష్టిలో వుంచుకొనే "రాత్ కలీ ఏక్ ఖాబ్ మె ఆయీ ఔర్ గలే కా హార్ హుయి..." అన్నాడు. అయితే మధుబాలతో పెళ్ళి జరిగిన సంతోషం వుండీ వుండగానే ఆమె హృద్రోగం ఉందనీ, సంతానవతిగా అర్హత లేదని తెలియవచ్చింది. మొదటి భార్య బెంగాలీ వనిత రుమాదేవి. వీరిద్దరి సంతానమే అమిత్‌కూమార్. రుమాదేవి కొడుకును భర్త దగ్గర వదిలి వెళ్ళిపోయి ద్వితీయ వివాహం చేసుకున్నది. మధుబాల మృతి చెందిన తర్వాత యోగితా బాలిని వివాహమాడారు. అనతికాలంలోనే నటి లీనా చందావర్కర్ ను పెళ్ళి చేసుకున్నారు. లీనాతో తిరిగి మధుబాలను దర్శింప గలిగారు. "హాల్ క్యా హై జనాబ్ కా?" అంటూ మందహాసం చేస్తూ స్వరం కలిపింది లీనా.

జీవితంలో అనేక సందర్భాలలో తీవ్ర మనస్తాపానికి, పలువురి కువిమర్శలకు, ఎన్నో రకాల చికాకులకు గురైన కిషోర్ తన మనోనిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం చెక్కుచెదరనివ్వలేదు. వ్యక్తిగా కూడా కిషోర్ చాలా ఉన్నతుడు. చలన చిత్రాలలో గాని, స్టేజీ మీద గాని గంతులు వేస్తూ, మేనరిజం లను అభినయిస్తూ, ప్రజలను కడుపుబ్బ నవ్వించిన కిషోర్‌ది నిజానికి చాలా గంభీర స్వభావం. సినీ ప్రపంచ హంగామాలకు, ఆడంబర విన్యాసాలకు, పార్టీలకు చాలా దూరంగా ఉండేవారు. ఆనందమైనా, దుఖఃమైనా తనలోనే యిముడ్చుకొని, వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తనవరకే పరిమితం చేసుకున్న మహోన్నత వ్యక్తి కిషోర్.

"ప్రజలంతా ఎన్నో బాధల్ని, చికాకులను మరచిపోవడానికి నా సినిమాలు చూస్తారు. నా పాటలు వింటారు. ప్రతి మనిషికీ బాధలుంటాయి. అయితే కళాకారుడు వాటన్నిటికీ అతీతుడు కావాలి. తనను అభిమానించే ప్రజలను ఎల్లపుడూ నవ్వించాలి. ఆహ్లాదం కల్పించాలి. ఆనంద డోలికల్లో ఓలలాడించాలి. అంతే గాని మన బాధ వారికి పంచకూడదు." ఇదీ కిషోర్ నమ్మిన, ఆచరించి చూపిన జీవిత సత్యం.

“ చమన్‌సే భి ఎక్ ఫూల్ బిఛ్‌డాతో క్యా హై,

నయే గుల్ సె గుల్షన్ తొ ఆబాద్ హోంగే,

సవేరే కా సూరజ్ తుమ్హారే లియే హై. ”

"తోటలో నుండి నాలాంటి ఒక పువ్వు రాలిపోతే ఏమయింది? ఎన్నో మొగ్గలు పూవులై విరుస్తాయి. వికసిస్తాయి. పరిమళాన్ని వెదజల్లుతాయి. కాబట్టి నేను పోయానని కలత చెందకండి."

దేశంలో ఎమర్జెన్సీ విధింపు కిషోర్ పాలిట కూడా ఆశనిపాతంఅయింది. సంజయ్ గాంధీ ముఖ్య అనుచరుడు వి.సి.శుక్లా చెప్పిన ప్రకారం ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనని కారణంతో కిషోర్ పాటలు 1976 మే నెల నుండి ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రసారం చేయడం పూర్తిగా ఆపివేశాయి. పులిమీద పుట్రలా ఇన్‌కంటాక్స్ దాడులు ముమ్మరంగా సాగాయి. దేనికీ ఎత్తిన తల దించలేదు. ఎమర్జన్సీ అంతరించటంతో కిషోర్ గాన మాధుర్యం తిరిగి ఎల్లెడలా ప్రవహించింది. మొత్తం మీద కిషోర్ జీవితంలో నీలినీడలు అనేకం. సినీ ప్రపంచంలో వ్యక్తిగత జీవితంలో కిషోర్ అనేక మార్లు ఘాటైన దెబ్బలు తిన్నారు. అపనిందలకు గురయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)