సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఈయన చిన్నతనంలో చాలా అల్లరి చేసేవారు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవారు. దానితో ఈయన పక్కంటి పిన్ని జానకాంబ ఈయనను వేలు అని పిలిచేవారు. ఈయన నటించిన నాలుగు స్తంభాలాటలో ఈయన పాత్ర పేరు 'సుత్తి'. ఆ చిత్ర విజయం తరువాత అందరూ ఈయనను సుత్తివేలు అని పిలవడం ప్రారంభింఛారు. సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి ఈయనకు నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దానితో ఏడవ తరగతి తప్పి తండ్రితో చీవాట్లు తిన్నారు. ఈయనకు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం హైదరాబాదుకు చేరుకున్నారు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారు. 1967లో ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నారు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారు.
1981 లో విశాఖపట్నం డాక్ యార్డులో శాశ్వత ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చారు. భమిడిపాటి అంతా ఇంతే నాటకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ జంధ్యాల తన చిత్రం ముద్ద మందారంలో అయనకు రిసెప్షనిష్టుగా చిన్న పాత్రను ఇచ్చారు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. అటు పిమ్మట జంధ్యాల తన వరుస చిత్రాలైన మల్లె పందిరి నాలుగు స్తంభాలాట లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చారు. ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నారు.
ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించారు. ఆనంద భైరవి రెండుజెళ్ళ సీత శ్రీవారికి ప్రేమలేఖ చంటబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించారు. త్రిశూలం చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందారు. తర్వాత టి. కృష్ణ వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చారు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. వందేమాతరం ప్రతిఘటన కలికాలం ఒసేయ్ రాములమ్మ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. వందేమాతరం చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
ఈయన తన స్థిర నివాసం మద్రాసులో ఏర్పరుచుకున్నారు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలడంతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేక పోయారు. దీనితో పలు టెలివిజన్ ధారావాహికలలో నటించారు. ఆనందోబ్రహ్మ మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు భమిడిపాడి రామగోపాల్ కథలు ఈయనకు మంచిపేరు తీసుకువచ్చాయి. చివరి రోజులలో తన మకాంను హైదరాబాదుకు మార్చారు. సుత్తివేలు వివాహము లక్ష్మీరాజ్యంతో జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి సంతానము.(భువనేశ్వరి శ్రీదేవి జగన్నాథ ఫణికుమార్ సత్యవాణి) ఆయనకు ఆంగ్ల రచయిత షేక్స్పియర్ అంటే అభిమానం. అనారోగ్యంతో బాధపడుతూ 2012, సెప్టెంబరు 16 న మద్రాసు లోని ఒక ఆసుపత్రిలో మరణించారు .