కార్ల్ మార్క్స్ మళ్లీ పుట్టాలి !
July 14, 2021
0
పేదల దేవుడు కార్ల్ మార్క్స్ పుట్టి సరిగ్గా నేటికి 196 ఏళ్ళు పూర్తయ్యింది. మార్క్స్ రాసిన పెట్టుబడి, కమ్యూనిస్టు మేనిపెస్టోలతో తెచ్చిన ఒక వాదం ప్రపంచ గతిని మార్చేశాయి. మార్క్సిజంగా ప్రపంచ వ్యాప్తమైంది. '' ప్రపంచ కార్మికులారా ఏకం కండి'' అని కార్ల్ మార్క్స్ పిలుపునిచ్చాడు. ''మతం ఒక మత్తు లాంటిది'' అని ఉద్యమించాడు. బాధ్యతలేని ప్రజా ప్రతినిధులని ఉద్దేశించి ''వీరంతా ప్రజలెన్నుకున్న పార్లమెంటును బాతాఖానీ క్లబ్బుగా మార్చేస్తున్నారని'' విరుచుకుపడ్డాడు. ''వ్యక్తిగత ఆస్తిని నిర్మూలించడం ద్వారానే ప్రపంచంలో పేదరికం పోగొట్టవచ్చని'' ఆశ పడ్డాడు. ''జీవన పోరాటంలో పరాయి భాష ఒక ఆయుధం లాంటిది'' అని పదే పదే చెప్పాడు. ''వ్యక్తిగత శ్రమ సామాజిక శ్రమగా ప్రత్యక్షమయ్యే రూపమే డబ్బు'' అని నిర్వచించాడు. ''పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నంతకాలం ఆర్థిక సంక్షోభాలు ఉంటాయని'' జోస్యం చెప్పాడు. ''పెట్టుబడిదారి విధానం అత్యున్నత దశకు చేరిన తర్వాత పతనమవడం ఖాయమని'' చెప్పాడు. ''పుస్తకాలు నాకు బానిసలు..నాకు సేవ చేసే తీరాలని'' హాస్య చతురత ప్రదర్శించేవాడు. ''మనిషి సృష్టించిన మహోన్నత జీవి మనిషే. మనిషి ఉనికిని దెబ్బకొట్టే, బానిసను చేసే నిరర్థక జీవిగా మార్చే పరిస్థితులన్నీటిని కూలదోయాలని'' ప్రయత్నించాడు. ''అపార జన సందోహాన్ని అత్యల్ప సంఖ్యాకులు దోచుకునేందుకు అవకాశం ఉన్న మహా భీకర వ్యవస్థ'' అని బాధపడ్డాడు. ''కాడి కింద మెడ పెట్టి బతకడం అంటే నాకు పరమ రోత'' అని నినదించాడు. ''మన అస్తికలు మహానుభావుల అశ్రుధారలతో పునీతమవుతాయని'' కలలు గన్నాడు. 150 ఏళ్ల క్రితమే కార్ల్ మార్క్స్ ఈ వ్యవస్థని ఉహించాడు. తన వాదంతో ప్రపంచ దేశాలు అనేకం బానిస సంకెళ్ళు తెంచుకున్నాయి. మార్క్స్ స్ఫూర్తితో లెనిన్, స్టాలిన్, హోచిమేన్, ఫిడేల్ కాస్ట్రో, చేగువేరా, చావెజ్ లాంటి మహోన్నత వ్యక్తులు తమ పోరాటాలు కొనసాగించారు. మార్క్స్ కుటుంబం తినడాని తిండి లేకపోయినా ప్రజల కోసం జీవితాన్నీ అర్పించింది. ధ్వంసం అవుతున్న ఈ వ్యవస్థల్ని బాగుచేసేందుకు కార్ల్ మార్క్స్ మళ్లీ పుట్టాలి.