వరకట్న నిషేధ నిబంధనలను కేరళ ప్రభుత్వం సవరించింది. 14 జిల్లాలుగల ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు వరకట్న నిషేధ అధికారులను నియమించేందుకు వీలు కల్పిస్తూ నిబంధనలను తీసుకొచ్చింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జి విడుదల చేసిన ప్రకటనలో, వరకట్న నిషేధ అధికారులను నియమించేందుకు వీలుగా నిబంధనలను సవరించినట్లు తెలిపారు. ఈ అధికారులు ఇప్పటికే మూడు జిల్లాల్లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం తిరువనంతపురం, ఎర్నాకుళం, కొజిక్కోడ్ జిల్లాల్లో వరకట్న నిషేధ అధికారులు ఉన్నారన్నారు. అన్ని జిల్లాల్లోనూ వరకట్న నిషేధ అధికారులను నియమిస్తామని చెప్పారు. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులు వరకట్న నిషేధ అధికారులుగా వ్యవహరిస్తారని చెప్పారు. చీఫ్ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్గా మహిళా, శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరకట్న వేధింపుల కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులకు శిక్షణనిచ్చే కార్యక్రమం తొలి దశ పూర్తయిందన్నారు. వరకట్న వేధింపులకు గురయ్యేవారు ఫిర్యాదు చేయడంలో సహాయపడటానికి ఆసక్తిగల స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానించిందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా సలహా మండళ్ళను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.