సౌందర్య

Telugu Lo Computer
0


సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది.

తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది. హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే చిత్రంలో నటించింది.

సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది.

సౌందర్య 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించారు.  ఎన్నికల సందర్భంగా, భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె సోదరుడు, కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్ నాధ్ కూడా ఆ ప్రమాదంలో మరణించారు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం "ఆప్త మిత్ర" విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్ధం "సౌందర్య స్మారక పురస్కారం"ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు.

తెలుగు సినీపరిశ్రమలో అత్యంత ప్రభాశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ సరసన రాజా, జయం మనదేరా, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలందుకున్నారు. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు. అందాల ప్రదర్శనకి బద్ధ వ్యతిరేకి. తెలుగు ప్రజలు ఆమెనెప్పటికీ మరువలేరు. పన్నెండేళ్ళ అచిరకాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలనందుకొంది. అవి: అమ్మోరు (1994), అంత:పురం(1998), రాజా (1999), ద్వీప (2002) (ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), ఆప్తమిత్ర (2004). కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మక పురస్కారాలు దొనిసగలి (తెలుగులో మహిళ), ద్వీప (ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), ఆప్తమిత్ర చిత్రాలకై అందుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు, పవిత్రబంధం, అంత:పురం చిత్రాలకై అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు. ఆమెను జూనియర్ సావిత్రి అంటారు. సౌందర్యకు నవరస నటన మయూరి అనే బిరుదుగలదు.

సౌందర్య అష్టగ్రామంలో జన్మించింది, ఆమె స్మార్థ బ్రాహ్మణి. ఆమె ఆర్.ఎస్.ఎస్.తో ప్రభావితమై భా.జ.పా.లో చేరారు. ఈమె తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘును 2003 ఏప్రిల్ 27లో వివాహ మాడారు. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి. ఈమె తాను మరణించే నాటికి 'కమ్లి' అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు, దీనికి దర్శకుడిగా కె.ఎన్.టి.శాస్త్రి వహించేవారు. ఈమె 'అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' (ASSET) ద్వారా తన భర్త, ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్నాటక, ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరచారు. ఓ అనాథాశ్రమాన్ని, 'అమర సౌందర్య విద్యాలయ' పేరుతో ఓ పాఠశాల స్థాపించారు. తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాక తన భర్త, ఆడపడుచుల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు, సహాయ సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది.

2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భాజపా కి ప్రచారం చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరు లోని జక్కూరు విమానాశ్రయం నుంచి మనరాష్ట్రం లోని కరీంనగర్‌ లో పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణంలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)