కూతుర్ని చంపిన తల్లి
July 15, 2021
0
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాలయం సమీపంలోని కరమదై ప్రాంతానికి చెందిన నాగమణి (50) తన కూతురైన నదియా అలియాస్ మహాలక్ష్మి (30)తో కలిసి జీవిస్తోంది. నాగమణి భర్త రోజువారీ కూలీగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కొన్నేళ్ల క్రితం నాగమణి భర్త చనిపోయాడు. అప్పటి నుంచి నాగమణి కూలికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. నాగమణి కూతురు మహాలక్ష్మికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. మహాలక్ష్మి భర్త శ్రవణకుమార్ కొన్ని నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. భర్త చనిపోయినప్పటి నుంచి మహాలక్ష్మి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే.. మహాలక్ష్మి కొన్ని రోజులుగా ఎవరితోనో పిల్లలను కూడా పట్టించుకోకుండా గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుతోంది. ఇది గమనించిన నాగమణి కూతురిని మందలించింది. అయినా మహాలక్ష్మి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ విషయంలో తల్లీకూతురి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. కూతురి ప్రవర్తన పట్ల విసిగి పోయిన నాగమణి నిద్రిస్తున్న మహాలక్ష్మి తలపై బండరాయి తెచ్చి వేసింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై మహాలక్ష్మి చనిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మహాలక్ష్మి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహాలక్ష్మి ఫోన్లో ఎవరితో మాట్లాడిందన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.
Tags