భార్య అంటే…?

Telugu Lo Computer
0


చాలా మంది దృష్టిలో జీతం ఇవ్వనక్కర్లేని పనిమనిషి.  చివరకు ఓ ప్రభుత్వ విద్యుత్తు సంస్థ కూడా ఇలాగే భావించి, హైకోర్టులో వాదించి అక్షింతలు వేయించుకున్నది… అభాసుపాలైంది.  మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు గృహిణుల గౌరవాన్ని పెంచేలా ఉంది, కష్టాన్ని గుర్తించేలా ఉంది. వివరాల్లోకి వెళితే… మాలతి… 2009లో… పశువుల కోసం దాణా సేకరణకు వెళ్లి విద్యుత్తు తీగెలకు తగిలి, షాక్‌కు గురై మరణించింది… భర్త కోర్టును ఆశ్రయించాడు… 5 లక్షల కనీస పరిహారం ఇప్పించాలని కోరాడు… అంతకు ముందు అధికారులకు చెబితే సహజంగానే వాళ్లు ఆ కోరికను చెత్తబుట్ట పాలుచేశారు… కోర్టు ఏం చేసిందంటే..? నెలకు కనీసం 3 వేల దాకా సంపాదిస్తున్నది కాబట్టి 4 లక్షల పరిహారం వెంటనే చెల్లించాలని పాండిచ్చేరి విద్యుత్తు బోర్డును ఆదేశించింది… 

అసలు ఆమె కేవలం ఓ గృహిణి మాత్రమే… ఏమీ సంపాదించదు… పైగా మా నిర్లక్ష్యం కూడా ఏమీలేదు… ఆమె నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్తు ప్రమాదం జరిగింది అని అప్పీల్ చేసింది… ‘‘ఆమె ఓ భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నది… ఇద్దరు పిల్లలకు తల్లి… ఆమె కుటుంబానికి ఒక ఆర్థిక మంత్రి… ఒక చెఫ్… ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్… జమాఖర్చులు సరిచూసుకుంటుంది… భర్త అలాంటి భార్యను కోల్పోయాడు… పిల్లలు తల్లిని కోల్పోయారు… ఆమె ప్రేమను, అభిమానాన్ని కోల్పోయారు…’’ అని ఆ బెంచ్ వ్యాఖ్యానించింది.  ఆమెను కోల్పోవడం వల్ల ఆ భర్త, ఆ పిల్లలకు జరిగిన నష్టాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే… అని చెప్పిన కోర్టు విద్యుత్తు బోర్డు వాదనను పూర్తిగా తోసిపుచ్చింది… ‘‘ఒక సాధారణ మనిషికి విద్యుత్తు వ్యవస్థ, లైన్లు, ప్రమాదాల గురించి ఏం తెలుసు..? విద్యుత్ కంపెనీయే జవాబుదారీ అవుతుంది… గృహిణి అంటే ఒక భార్య, ఒక తల్లికన్నా మిన్నగా పరిగణించాలి…’’ అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)