ఇంటి వైద్యం

Telugu Lo Computer
0

ఆయుర్వేదం మనకు ఆనాదిగా వస్తున్న సాంప్రదాయ వైద్యం. వైద్య రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ ప్రాధాన్యం తగ్గడంలేదు. వ్యాధి తగ్గడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా ఇందులో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
కొన్ని ముఖ్య సమస్యలకు ఇంటివద్దే పరిష్కారం లభిస్తుంది. 

శ్వాసకోశ వ్యాధులు
👉జిల్లేడు మొగ్గను కషాయం బెట్టి అందులో తాటి బెల్లం కలిపి వరుసగా ఏడు రోజులు వాడితే దగ్గు-దమ్ము తగ్గుతాయి.
👉మిరియాల కషాయం లేదా అల్లం రసం తేనెతో కలిపి సేవించినా శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.
👉అడ్డసరం ఆకు కషాయం రోజు చెంచాడు తీసుకున్నా లేదా మద్దిచెక్క చూర్ణం పాలలో కలుపుకుని తీసుకున్నా ఫలితముంటుంది.
👉సర్పాక్షి వేరును చూర్ణం చేసి అల్లం రసంలో కలిపి తీసుకుంటే క్రమంగా దగ్గు-దమ్ము తగ్గుతాయి.

రక్తహీనత
👉నీడలో ఎండబెట్టిన సరస్వతి ఆకు చూర్ణం, చిటికెడు మిరియాల చూర్ణం, ఆవుపాలతో కలిపి సేవించాలి. క్రమంగా రక్తవృద్ధి జరుగుతుంది.
👉నీడలో ఎండబెట్టిన ఉసిరి చూర్ణాన్ని ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు రెండు చెంచాలు తినాలి.
👉విటమిన్ బి లోపం వల్ల రక్తహీనత కలిగిన వాళ్ళు గలిజేరు ఆకును కూర లేదా పచ్చడిగా తీసుకుంటే మంచి ఫలితముంటుంది.
👉విష్ణుకాంత సమూలం నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. దానిని పాలతో కలిపి తీసుకుంటే రక్త క్షీణత తగ్గుతుంది.  

మూర్ఛ
👉తులసి ఆకురసం సైందవ లవణంతో కలిపి 1 లేదా 2 చుక్కలు వేస్తే స్పృహ వస్తుంది.
👉పసుపు పొడి పొగ వేసినా మూర్చ నుండి మెలకువ వస్తుంది.
👉తరచుగా పిల్లల్లో వచ్చే మూర్ఛవ్యాధులకు వస కషాయంతో స్నానం చేయించాలి.
👉కమ్మగగ్గెర ఆకును ఎండించి చూర్ణం చేసి నస్యంగా వాడాలి.
👉మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తికి 5 లేక 6 చుక్కల వావిలాకు రసం ముక్కులో వేస్తే ఫలితముంటుంది.
👉సీతాఫలం ఆకులు నలిపి వాసన చూపితే మూర్ఛ వ్యక్తికి మెలుకువ వస్తుంది. లేదా ఉల్లి రసం ముక్కులో వేసినా మంచి ఫలితం ఉంటుంది.

తెల్లమచ్చలు
👉వేపకాయలు, ఆకులు, పువ్వులు సమానంగా కలిపి మెత్తగా నూరుకోవాలి. దీనిని రోజుకు రెండుసార్లు అరతులం చొప్పున తింటే నలభై రోజుల్లో తెల్లమచ్చలు తగ్గుతాయి.
👉పిచ్చి కుసుమ ఆకుల రసాన్ని తులసి ఆకుల రసంతో కలిపి మచ్చలు ఉన్నచోట రాయడం వల్ల క్రమంగా అవి తగ్గుముఖం పడుతాయి.
👉తంగేడు చెట్టు పట్టను ఆవుపాలలో దంచి తెల్లమచ్చల మీద రాస్తే తగ్గుతాయి.

నిద్రలేమి
👉శతావరి చూర్ణం, బెల్లంతో కలిపి తింటే చక్కని నిద్ర వస్తుంది.
👉కలమంద నూనె తలకు మర్దన చేయాలి లేదా మోది చూర్ణం, బెల్లంతో కలిపి తిన్నా సుఖనిద్ర వస్తుంది.
👉మరాటి మొగ్గ పొడి చేసి పాలలో కలిపి పడుకునే ముందు తాగాలి. అలాగే, వేడి పాలు తాగినా సుఖనిద్ర వస్తుంది.

నోటి సమస్యలు
👉లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.
👉వెలగ ఆకు రసంలో నిమ్మ ఉప్పు కలిపి పుక్కిలించాలి.
👉 పల్లేరు ఆకు రసం, తేనె కలిపి పుక్కిలించినా ఫలితం ఉంటుంది.
👉నోటి పూతను సులువుగా తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే తగ్గిపోతుంది.
👉లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూత తగ్గిపోతుంది.
👉గొబ్బి ఆకు (ముళ్ళ గోరింట) ఆకు నమిలి ఉమ్మేయాలి. అలాగే, పల్లేరు రసంలో తేనె కలిపి పూసినా నోటిపూట ఇట్టే తగ్గిపోతుంది.

తల తిప్పటం
👉అల్లం, ఉప్పు కలిపి పొద్దున తింటే తగ్గుతుంది.
👉10 గ్రాముల అల్లం, 10 గ్రాముల బెల్లం దంచి ముద్ద చేసి నోట్లో పెట్టుకోవాలి. దాని నుండి వచ్చే ఊటను మింగాలి. ఇలా వారం రోజులు చేస్తే తల తిప్పుట తగ్గిపోతుంది.
👉మునగ ఆకులు మిరియాలు కలిపి మెత్తగా నూరి తలకు పట్టువేస్తే తలదిమ్ము తగ్గుతుంది.

మొటిమలు
👉పుదీన ఆకులను మెత్తగా నూరి క్రమం తప్పకుండా మొటిమలపై రాసుకుంటే అవి తగ్గుతాయి.
👉వెల్లుల్లి రసం తీసి ముఖానికి రాసుకున్నా లేదా మద్ధిపట గంధాన్ని మొటిమలపై రాసినా మంచి ఫలితముంటుంది.
👉ఆముదం, గ్లిజరిన్ మిశ్రమాన్ని రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు ఇట్టే మాయమవుతాయి.
👉మొటిమల వల్ల ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడితే నిమ్మరసాన్ని అద్ది సుతిమెత్తగా మర్దన చెయ్యాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

రక్తపోటు (బి.పి.)
👉సుగంధపాల, మారేడు కలిపి వాడితే బి.పి. అదుపులో ఉంటుంది.
👉మారేడు ఆకుల కషాయం రోజూ తాగాలి. లేదా రోజూ చెంచెడు కల్యమాకు రసం తాగినా రక్తపోటు నిలకడగా ఉంటుంది.
👉ఈశ్వరి వేరు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.
👉కాచి చల్చార్చిన నీటిలో అల్లం రసాన్ని కలిపి పొద్దున్నే తాగితే బి.పి. అదుపులో ఉంటుంది.

అవాంఛిత రోమాలు
👉గన్నేరు వేర్లు, నేపాలం వేర్లు, తెల్ల తెగడ వేర్లు అన్నీ కలిపి ఆవనూనెలో వేసి సన్నని మంటమీద వేడి చెయ్యాలి. చల్లారిన తర్వాత అవాంఛిత రోమాలు ఉన్న చోట మర్దన చేసి పదిహేను నిమిషాల తర్వాత కడగాలి.
👉నాగకేశరాలు, ఆవనూనె కలిపి ఎనిమిది రోజులు ఎండబెట్టాలి. ఆ తర్వాత ఆవాంఛిత రోమాలు ఉన్నచోట రాసి ఐదు నిమిషాల తర్వాత తుడుచుకోవాలి.
👉జమ్మివృక్షం పంచగాలు నానబెట్టి రుబ్బి అవాంఛిత రోమాల భాగంపై రాసి ఇరవై నిమిషాల తర్వాత తుడుచుకుంటే మంచి ఫలితముంటుంది.

మలబద్దకం
👉అరటి పండు రోజూ ఉదయం పరిగడుపున తింటే మలబద్దకం పోతుంది.
👉రాత్రి పడుకునే ముందు వేడి నీటితో త్రిఫల చూర్ణం తీసుకుంటే ఫలితముంటుంది.
👉రోజూ రెండుపూటల కలబంద గుజ్జు తింటే వారం రోజుల్లో ఈ సమస్యను అధిగమించవచ్చు.

అతిమూత్రం నివారణ
👉నేరెడు గింజల చూర్ణం 40 రోజులు పొద్దున చెంచాడు పొడిని నీళ్లలో కలిపి తీసుకుంటే అతి మూత్రవ్యాధి అదుపులో కొస్తుంది.
👉అరటిపండ్లు ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని అధిగమించవచ్చు.
👉ధనియాల కషాయంలో ఉప్పు కలిపి కొద్ది రోజులు తీసుకున్నా లేదా మెంతుల కషాయం తాగినా మంచి ఫలితముంటుంది.
👉వెల్లుల్లి రసాన్ని 15 రోజులపాటు తీసుకున్నా అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది.
👉కామంచి గింజల చూర్ణం కషాయం కాచి తాగినా అతిమూత్రం తగ్గుతుంది. అంతేకాదు, మధుమేహం వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.
👉మర్రిచెక్క కషాయం లేదా మెంతుల కషాయం క్రమం తప్పకుండా తీసుకున్నా మంచి ఫలితముంటుంది.

తల వెంట్రుకలు పెరుగడానికి...
👉మందార పువ్వులు,మైదాకు, కలమంద గుజ్జు, నల్ల నువ్వుల నూనెలో వేసి కాచి వడబోసి తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా పెరగడమే కాదు తలనొప్పి కూడా తగ్గుతుంది.
👉కరివేపాకు రసం, వెల్లుల్లి పొట్టు నల్ల నువ్వుల నూనెలో కాచి పెట్టుకున్నా వెంట్రుకలు పెరుగుతాయి.
👉గుంటగలగర ఆకురసం నువ్వుల నూనెలో వేడి చేయాలి. తర్వాత తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి.

అతిసారం
👉బచ్చలికూర, పెరుగుతో కలిపి తింటే అతిసారం తగ్గుతుంది.
👉పాలకూరను నూరి చక్కెర కలిపి తీసుకున్నా లేదా గసగసాలు పటిక బెల్లం సేవించినా నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
👉పుంటికూర (గోంగూర) ఆకును ముద్దగా చేసి తిన్నా చక్కని ఫలితముంటుంది.
👉చిరుబొద్ది ఆకుల రసం, దానిమ్మ పండ్ల రసం నెయ్యిలో కలిపి తీసుకున్నా విరేచనాలు తగ్గుముఖం పడతాయి.

ఉబ్బసం
👉తెల్ల జిల్లేడు పువ్వుల చూర్ణాన్ని బెల్లంతో కలిపి తింటే ఉబ్బసం తగ్గుతుంది.
👉అడ్డసరం ఆకులు ఎండబెట్టి చూర్ణం చేయాలి. అందులో శొంఠి, మిరియాల చూర్ణాలు కలిపి దానిలో తిప్పతీగ రసంతో మాత్రలు తయారు చేసి వీటిని ఇరవై రోజులు వాడితే ఎంత ఉబ్బసం, ఆయాసం ఉన్నా తగ్గుతాయి.
👉 వెల్లుల్లి రసం వేడి నీళ్లలో వేసి తాగినా లేదా మిరియాల చూర్ణం తేనెలో కలిపి సేవించినా ఫలితముంటుంది.
👉నేపాల గింజలు నిప్పుల మీద వేసి ఆ పొగ పీలిస్తే ఉబ్బసం తగ్గుతుంది.

గుండెజబ్బులు
👉తేనె వేడి నీళ్లలో కలిపి తాగితే గుండె జబ్బులు దరిచేరవు.
👉మద్ది చెక్క (తెల్లది) యష్టిమధుక చూర్ణాలను కలిపి నీళ్లలో కలుపుకుని తాగితే గుండె జబ్బులను నివారించవచ్చు.
👉స్వచ్ఛమైన తేనె అంటే వేప చెట్టుకు పెట్టిన తేనె తుట్టె నుంచి తీసింది.
👉మనం తీసుకునే ఆహారం వల్లే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించాలి.

పడిశం
👉నీలగిరి (జామాయిల్) ఆకులు వేడి నీళ్లలో వేసి ఆవిరి తీసుకుంటే పడిశం ఇట్టే తగ్గిపోతుంది.
👉మరో సులువైన మార్గం చిటికెడు పసుపు వేడి పెనంపై వేసి ఆ పొగను పీల్చాలి. అలాగే, పసుపు పొడి కాగే నీటిలో వేసి ఆవిరి పట్టినా ఉపశమనం కలుగుతుంది.
👉మిరియాల పొడి కషాయం తాగినా, మిరియాల పొడిని తేనెలో కలిపి సేవించినా పడిశం తగ్గుముఖం పడుతుంది.
👉వస గంధం ముక్కుకు రాసుకుంటే పడిశం తగ్గుతుంది.

పులిపిర్లు
👉పులిపిర్లకు బొప్పాయి పాలను రాస్తే ఊడిపోతాయి.
👉అరటిపండు తొక్కకు ఉండే నారవంటి పదార్థం పులిపిరికాయల మీద రాసినా తగ్గుముఖం పడుతాయి.
👉సున్నం, బెల్లం కలిపి అవి ఉన్న చోట పెడితే ఫలితముంటుంది.
👉రెడ్డివారినాగబాల చెట్టు కొమ్మలను తెంపితే వచ్చే పాలను పులిపిరి కాయల మీద రాయాలి. ఇలా నాలుగు లేదా ఐదు సార్లు రాస్తే పులిపిర్లు ఇట్టే రాలిపోతాయి.

ఎసిడిటీ
👉ఎసిడిటీకి దూరంగా ఉండాలనుకుంటే వేపుడు కూరలు, మసాలాలతో చేసిన వంటకాలను మానేయాలి.
👉పచ్చబొట్టు ఆకు, నాగదమని ఆకు రెండూ కలిపి దంచిన ముద్దను తిన్న తరువాత గ్లాస్ నీళ్ళు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.
👉దానిమ్మ రసం తీసుకుంటే ఎసిడిటీ రాదు. ఒకవేళ ఉన్నా తగ్గుతుంది. రోజూ అరటి పండు తిన్నా ఫలితముంటుంది.
👉అల్లం ముక్క వేసిన పాలను బాగా మరిగించి తాగితే చక్కని ఫలితముంటుంది.
👉ఈ సమస్యతో బాధపడుతున్న వారు తరచూ మంచి నీళ్ళు తాగుతుండాలి.

ఆకలికి
👉అల్లం ముక్కలు, సైందవ లవణం కలిపి భోజనానికి ముందు నమిలి ఆ రసాన్ని మింగితే ఆకలి పుడుతుంది.
👉మిరియాల చారుతో అన్నం తింటే ఆకలి లేదు అన్న సమస్యే రాదు.
👉నేపాళ గింజల చూర్ణం, జీలకర్రను చక్కెరతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి ఆకలి పుడుతుంది.
👉ఉత్తరేణి బియ్యం, మేకపాలలో కలిపి నూరి మాత్రలుగా చేసి పాలతో తీసుకుంటే ఆకలి ఆధిక్యాన్ని తగ్గించవచ్చు.

అధిక రుతుస్రావం
👉ఉసిరికాయ, కరక్కాయ, రసాంజనం మూడింటినీ కలిపి చూర్ణం చేసి తాగితే నెలసరిలో అధికస్రావాలు తగ్గుతాయి.
👉ఇంటి ముందు అందం కోసం పెంచుకునే ఎర్రమందారం పువ్వులు కూడా ఆరోగ్య ప్రదాయనిగా పనిచేస్తాయి. ఈ పవ్వుల కషాయం తాగినట్లయితే అధిక రక్తస్రావం తగ్గిపోతుంది.

కడుపు ఉబ్బరం
👉ఒక గ్రాము సైందవ లవణం, 5 గ్రాముల అల్లం కలిపి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
👉అన్నం తిన్న తర్వాత వాము, ఉప్పు కలిపి తీసుకున్నా ఈ సమస్యను అధిగమించ వచ్చు.

తలవెంట్రుకలు ఊడిపోకుండా..
👉ఉసిరి రసం, గుంట గలగర రసం కొబ్బరినూనెలో కలిపి వేడి చేసి తలకు రాయడం వల్ల వెంట్రుకలు రాలవు.
👉తల వెంట్రుకలకు కొబ్బరి నూనెలో కలమంద గుజ్జు కలిపి వేడి చేసి రాయాలి. ఇది వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది.
👉బాధం, కరక్కాయ నూనె రాసినా కూడా మంచి ఫలితముంటుంది.

దంత సమస్యలు
👉నల్ల నువ్వులు తిని వెంటనే నీళ్ళు తాగితే కదులుతున్న దంతాలు గట్టి పడుతాయి.
👉వేపపుల్లతో పండ్లు తోమినా దంతాలు పటిష్టంగా ఉంటాయి.
👉జిల్లేడు పాలను నొప్పి ఉన్న పన్నుపై వేస్తే పంటి నొప్పి తగ్గుతుంది.

కాళ్ళ పగుళ్ళు
👉పసుపు, నువ్వుల నూనె కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
👉మెంతులు, మైదాకు కలిపి రుబ్బి పెట్టుకుంటే త్వరగా నయమవుతుంది.
👉మర్రిచెట్టు పాలు పట్టి వేసినా చక్కని ఫలితం ఉంటుంది.
👉త్రిఫలచూర్ణం వాడితే పగుళ్ళు రావు.

అజీర్ణం
👉రోజూ రెండు కప్పుల పెరుగు తింటే అజీర్ణం రాదు.
👉ఉల్లిగడ్డను కాల్చి కొంచెం ఉప్పు కలిపి మెత్తగా నూరి తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇలా రోజుకు ఒక్కసారి వారం రోజులు చేస్తే మరీ మంచిది.
👉జీలకర్ర కషాయం తాగితే అజీర్ణపు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
👉నేల తంగెడు చూర్ణం 1 లేదా 2 చెంచాలు అల్లం రసంతో కలిపి తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

అతి బరువు (ఊబకాయం)
👉రోజుకు రెండు కరివేపాకు రెమ్మలు తింటే ఒబేసిటి రాదు. పచ్చి కూరగాయల సూపు తాగినా ఫలితం ఉంటుంది.
👉కలమంద గుజ్జులో పసుపు కలిపి పరిగడుపున తీసుకుంటే మార్పు కనిపిస్తుంది.

అలసట
👉రోజువారీ జీవితంలో అందరూ ఎదుర్కొనే సమస్య అలసట. దీనిని అధిగమించేందుకు ద్రాక్షపండ్లు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తినాలి.
👉అలాగే, ఖర్జూర పండ్లను కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి తింటే చాలా మంచిది.
👉బాదం పాలు కూడా అలసటను దూరం చేస్తాయి.

నెలసరి నొప్పి
👉స్త్రీలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇదొకటి. ఉత్తరేణి రసం రోజూ చెంచా చొప్పున మూడు రోజులు పరికడుపున తీసుకుంటే ముట్టు నొప్పి తగ్గిపోతుంది.
👉టీ డికాషన్‌లో నిమ్మరసం పిండుకుని తాగినా ఉపశమనం కలుగుతుంది.
👉రేలకాయ గుజ్జు చూర్ణం చేసి గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే నొప్పి తగ్గడమే కాదు, నెలసరి క్రమపడుతుంది.

తలనొప్పి
👉పొద్దున లేవగానే రాగి చెంబులో నిల్వ ఉంచిన నీళ్ళను తాగడం వల్ల తలనొప్పి రాదు. ఉన్న నొప్పి కూడా మటుమాయం అవుతుంది.
👉ఒక చెంచాడు మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తాగాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల వాతంతో వచ్చే తలనొప్పి తగ్గుతుంది.
👉నడుం నొప్పి:👉
👉రాత్రి పడుకునే ముందు వేడినీటిలో ఆముదం కలిపి తీసుకోవాలి. ఉదయం సుఖవిరేచనం అయి నడుం నొప్పి తగ్గుతుంది.
👉రస కర్పూరం, నల్లమందు, కొబ్బరి నూనెలో కలిపి నడుంకు రాస్తే ఫలితముంటుంది.

బట్టతల
👉సీతాఫలం ఆకులు నూరి మేక పాలలో కలిపి తలకు రాస్తుండాలి. ఇలా చేయడం వల్ల బట్టతల తగ్గే అవకాశం ఉంది.
👉గురిగింజ ఆకురసం నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి తలకు రాసుకున్నా బట్టతల తగ్గే అవకాశం ఉంది.

కీళ్ళ నొప్పులు
👉నొప్పి ఉన్న కీలుపై జిల్లేడు ఆకు వేడి చేసి కట్టాలి.
👉మిరియాలు, బియ్యం రెండింటిని బాగా నూరి నొప్పి ఉన్న చోట కట్టు కడితే తగ్గుతుంది.
👉ఆహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తపడ్డా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

గుండె జబ్బులు
👉మంచి తేనె గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు మీ దరిచేరవు.
👉దానిమ్మ, పచ్చి ఉసిరికాయ రసం తాగినా కూడా హదయానికి ఎంతో మేలు చేస్తుంది.
👉మన ఆహార నియమాలతోనే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే, కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించడం చాలా మంచిది.

శిరోజాలు రాలుతుంటే
👉జుట్టురాలడానికి ప్రధాన కారణం నీళ్లతో క్లోరిన్‌ శాతం ఎక్కువగా ఉండటంతో పాటు విటమిన్‌ ‘ఏ’ లోపం కూడా.
👉రాత్రిపూట తలకు అరచెక్క నిమ్మరసం పట్టించి మర్నాడు తలస్నానం చేయాలి.దీనిలోని సిట్రిక్‌ ఆమ్లం శిరోజాల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
👉త్రిఫల చూర్ణాన్ని రెండు చెంచాలు తీసుకోని దానికి చెంచా చోప్పున మెంతి, ధనియాల పొడి కలిపి ఆహారంలో తీసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా పరిష్కారమౌతుంది.

సైనసైటిస్
👉వైరస్, బాక్టీరియా, ఫంగస్ కారణంగా వచ్చే సైనస్ వ్యాధి వల్ల ముక్కుతోపాటు గొంతు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. తలనొప్పి కూడా వస్తుంది. కొన్ని రోజులపాటు పట్టి పీడించే ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి.
👉టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి.
👉250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి.
👉300 మిల్లీ లీటర్ల క్యారట్ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒక సారి తాగాలి.
👉మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.

👉ఉల్లి, వెల్లుల్ని రేకులను తింటే సైనసైటిస్ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది.

Post a Comment

0Comments

Post a Comment (0)