చార్ధామ్ యాత్ర
July 07, 2021
0
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి దిగివస్తున్న వేళ చార్ ధామ్ (బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకాధీష్) సహా పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ప్రత్యేక రైలును నడిపేందుకు ఐఆర్సీటీసీ నిర్ణయించింది. రామాయణ సర్క్యూట్లో నడుస్తున్న 'శ్రీ రామాయణ యాత్ర' రైలు ప్రజాదరణ పొందింది. దీంతో ఐఆర్సీటీసీ 'దేఖో అప్నా దేశ్' డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ 'చార్ధామ్ యాత్ర'ను ప్రారంభించింది. యాత్ర 16 రోజుల పాటు ఉంటుంది. ఢిల్లీలోని సఫ్ధర్జంగ్ రైల్వేస్టేషన్ నుంచి సెప్టెంబర్ 18న రైలు బయలుదేరనుంది. యాత్రలో బద్రీనాథ్తో పాటు 'మన' గ్రామం (చైనా సరిహద్దులో ఉంది), నర్సింగ్ ఆలయం (జోషిమత్) ఆలయం, పూరి గోల్డెన్ బీచ్, కోనార్క్ సూర్యదేవాలయం, చంద్రభాగ బీచ్, ధనుష్కోడితో సహా రామేశ్వరం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, శివరాజ్పూర్ బీచ్, బెట్ ద్వారకతో సహా రిషికేశ్, జగన్నాథ్ పూరి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ రైలు సుమారు 8,500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్లో రెండు రెస్టారెంట్లు, ఒక ఆధునిక వంటగది, రైలు కోచ్లో షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్రూమ్ ఫంక్షన్లు, ఫుట్ మసాజర్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ట్రైన్ మొత్తం ఎయిర్కండిషన్ కాగా, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం రైలులో ప్రతి కోచ్కు సీసీటీవీ కెమెరాలను బిగించింది. దేశీయ పర్యాటకాన్ని రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ 'దేఖో అప్నా దేశ్'కు అనుగుణంగా ప్రత్యేక రైలును ఐఆర్సీటీసీ ప్రారంభిస్తోంది. ప్యాకేజీ ధరను రూ.78,585కు నిర్ణయించారు. రైలు ప్రయాణం, డీలక్స్ హోటళ్లలో వసతి, భోజనం, వాహన సదుపాయం, ఆలయాల్లో దర్శనం, ప్రయాణ బీమా తదితర వసతులను ఐఆర్సీటీసీ కల్పించనుంది. ఈ డీలక్స్ టూరిస్ట్ రైలులో కరోనా మహమ్మారి వేళ 120 మందికే అవకాశం కల్పిస్తోంది. ఫేస్ మాస్క్లు, హ్యాండ్ గ్లోవ్స్, శానిటైజర్ పర్యాటకులందరికీ ఐఆర్సీటీసీ కిట్లను సమకూర్చనుంది. అయితే, 18 సంవత్సరాలు దాటిన వారందరు కనీసం ఒక మోతాదు టీకా తీసుకొని ఉండాలి.