ఓటీటీకి ఇవ్వొద్దు !
July 04, 2021
0
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్స్ సమావేశం శనివారం హైదరాబాద్లో సమావేశమై తెలుగు సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబరు వరకు నిర్మాతలు వేచి చూడాలని, ఒకవేళ అప్పటికీ థియేటర్లు తెరచుకోకపోతే, ఓటీటీ వేదికల్లో తమ సినిమాలను విడుదల చేసుకోవాలని కోరింది. లాక్డౌన్ పరిస్థితుల వల్ల థియేటర్లు మూతపడటంతో చాలా కొత్త చిత్రాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా థియేటర్లు తెరిచే వరకు సినిమాలను ఓటీటీలో విడుదల చేయరాదని ఎగ్జిబిటర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. మండలి నిర్ణయాన్ని కాదని ఓటీటీలో సినిమాల విడుదల చేస్తే తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ఈనెల 7న మరోసారి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సమావేశం అవుతుందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయం తెలంగాణపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. సినిమా టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.