మెట్రో స్టేషన్లు మూసివేత ?

Telugu Lo Computer
0


గతేడాది నవంబర్ నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు సోమవారం నుంచి పార్లమెంట్‌ వద్ద నిరసన తెలుపనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాలు జరగినన్ని రోజులు..ప్రతి రోజూ 200 మంది రైతులు పార్లమెంట్ బయట ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారని రైతు సంఘం..సంయుక్త కిసాన్ మోర్చా ఇటీవల ప్రకటించింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. పార్లమెంట్ బయట నిరసన చేపట్టకుండా రైతు సంఘాలను ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆదివారం ఢిల్లీలోని అలిపుర్ లోని మంత్రమ్ రిసార్టులో రైతు సంఘాల నేతలతో ఢిల్లీ పోలీసులు సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ బయట కాకుండా మరో చోట రైతులు తమ ఆందోళనను చేయవచ్చని పోలీసులు రైతు నేతలకు సూచించారు. అయితే రైతులు దానికి నిరాకరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రైతు నేత శివకుమార్‌ కక్కా మాట్లాడుతూ సింగు సరిహద్దు నుంచి పార్లమెంట్‌కు ప్రతి రోజు 200 మంది రైతులు కవాతు నిర్వహిస్తారని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి నిరసనకారుడికి గుర్తింపు ఉంటుందని, వారి జాబితా సైతం ప్రభుత్వానికి ఇస్తామన్నారు. అయితే, నిరసనకారుల సంఖ్య తగ్గించాలని పోలీసులు కోరారని, దానికి తాము సిద్ధంగా లేమన్నారు. సమావేశానికి ముందు బీకేయూ నేత రాకేశ్‌ టికాయిత్‌ మాట్లాడుతూ నిరసనకు అనుమతిచ్చేందుకు పోలీసులు సిద్ధంగా లేరన్నారు.

మెట్రో రైళ్ల ద్వారా ఆందోళనకారులు పార్లమెంట్ కు చేరుకునే అవకాశముందని ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏడు మెట్రో స్టేషన్లను అలర్ట్ చేసింది. ఆందోళనలు హింసాత్మకంగా మారితే ఈ మెట్రో స్టేషన్లను మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో లోక్ కల్యాణ్ మార్గ్, జన్‌పథ్, మండి హౌస్,పటేల్ చౌక్, రాజీవ్ చౌక్,ఉద్యోగ్ భవన్ సెంట్రల్ సెక్రటేరియట్ స్లేషన్లు ఉన్నాయి

Post a Comment

0Comments

Post a Comment (0)