మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

Telugu Lo Computer
0



మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి  గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జూలై 7న జన్మించారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులయ్యారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్య  పోరాటాలలో పాల్గొని ఐదుసార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్య అనంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినారు.  ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు. 1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 1949లో కేఎస్ ప్రకాశ రావు దీక్షతో మొదలై బాలకృష్ణ సినిమా భైరవద్వీపం వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు.

ఐదుసార్లు జైలుకు వెళ్లిన స్వాతంత్య్రయోధుడూ- కమ్యూనిస్టు. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటుడు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవాడు, ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, ‘తెలుగువారి జానపద కళారూపాలు’ గ్రంథ రచయిత. ‘మన పగటి వేషాలు’, ‘ఆంధ్రుల నృత్యకళావికాసం’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత. ఎనభై ఏళ్లనాడు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. రామనాథశాస్త్రి శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటి పేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి,  ఫిబ్రవరి 22, 2011 తేదీన  తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని విజయవాడలో తన 95వ ఏట మరణించారు. కొన్ని రోజులుగా, మూత్ర సంబంధమైన, అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో మరణించారు. "మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణంతో జీవించి వున్న తెలుగు సినీ కళాకారుల్లో తానే పెద్ద" అన్నారు డా. అక్కినేని నాగేశ్వరరావు. నిజమే. నాయక పాత్రలు-అనామక పాత్రలు అనే సినీ కొలమానంతో ‘అక్కినేని ఎక్కాల్సిన మెట్లూ-మిక్కిలినేని దిగాల్సిన మెట్లూ లేవు’ అనే వాడుక లోని చమత్కారమూ నిజమే.

మిక్కిలినేని వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీయంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్-నైజాం నియంతృత్వానికి, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీల అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్యమండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నాన్ని మిక్కిలినేని నాటక రంగానికి పరిచయం చేశారు. ఏడు దశాబ్దాల క్రితం ఎంతటి ముందడుగో అది !

పల్నాటియుద్ధం-బొబ్బిలియుద్ధం-కాటమరాజు కథ తదితర 30 చారిత్రక-జానపద కళారూపాల ద్వారా ప్రజలను సమీకరించిన ప్రజానాట్యమండలి 1940లలో నిషేధానికి గురైంది. ఫలితంగా కొందరు సినీరంగాన్ని ఆశ్రయించారు. వారిలో కేబీ తిలక్, తాతినేని ప్రకాశరావు, గరికపాటి రాజారావు, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, సి.మోహనదాసు, టి.చలపతిరావు, వి.మధుసూదనరావు, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వంటి ప్రముఖులున్నారు.

వీరిలో నాటకరంగం నేపథ్యంగా సినీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. నాటకరంగాన్ని విడవని నాగభూషణం వంటి నటులూ ఉన్నారు. నాటక రంగానికి చెందిన 400 మంది కళాకారులను ‘నటరత్నాలు’ శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ప్రత్యేకత మిక్కిలినేనిదే! వీధినాటకాలు-జముకుల కథలు-బురక్రథలు ప్రదర్శిం చిన పాత రోజులను మరవకుండా, పాత స్నేహితాలను పునరావిష్కరించుకుంటూ తెలుగునేల నాలుగు చెరగులా తిరిగి స్వయంగా తెలుసుకున్న సమాచారంతో ‘ఆంధ్ర నాటకరంగ చరిత్ర’ రచించారు. డక్కికథ అనే పేరు నుంచి బురక్రథ అనేపేరు వచ్చిందని తన రచనలలో మిక్కిలినేని వివరించారు. 

సినీజీవితంలో ప్రవేశించేముందు మిక్కిలినేని వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయన కుమారుడు డా.విజయకుమార్ వెటర్నరీ వైద్యులుగా పదవీ విరమణ చేయడం గమనార్హం! మిక్కిలినేనికి ఇరువురు కుమార్తెలు.

Post a Comment

0Comments

Post a Comment (0)