తెలంగాణలో చికెన్ వినియోగం గత ఆరు నెలలతో పోలిస్తే రెట్టింపు అయిందని హోల్సేల్ చికెన్ వ్యాపారులు వెల్లడించారు. అంతేకాకుండా కరోనా సమయంలోనూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు చికెన్ తినాలని కూడా వైద్యులు సూచించడంతో చాలా మంది చికెన్ పై ఆసక్తి పెంచుకుంటున్నారు.దీంతో డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని పలువురు పౌల్ర్టీ వ్యాపారులు వెల్లడించారు. సాధారణ రోజుల్లో ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకు లక్ష కేజీల చికెన్ వినియోగం జరుగుతుందని వ్యాపారులు తెలిపారు. కానీ ప్రస్తుతం బోనాల జాతర సమయం, వాతావరణం చల్లగా మారిపోవడంతో చికెన్ అమ్మకాలు గత కొన్నిరోజుల నుంచి రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల కేజీలకు పెరిగినట్టు బేగం బజార్లోని హోల్సేల్ చికెన్ వ్యాపారి మహ్మద్ ఫాజిల్ తెలిపారు. రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. గత నెల రోజుల క్రితం రిటైల్ మార్కెట్లో కిలో చికెన్ 180 నుంచి 200 రూపాయలు పలకింది. కానీ ప్రస్తుతం 220నుంచి 260 రూపాయలకు చేరింది. దీంతో నాన్వెజ్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కోడిగుడ్లు, కోళ్లఉత్పత్తిలో అగ్రస్ధానంలో వుంది. దాదాపు తెలంగాణ నుంచే పక్క రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో చికెన్ వ్యాపారం రోజుకు కోట్లలోనే జరుగుతుంది. మాంసం ధరలు కొండెక్కి కూర్చోవడంతో అధిక శాతం మంది చికెన్వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ధరలు పెరిగిపోతుండడం వల్ల సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.