సి.యస్.ఆర్. ఆంజనేయులు

Telugu Lo Computer
0


సి.యస్.ఆర్. ఆంజనేయులు  (చిలకలపూడి సీతారామాంజనేయులు)  1907, జూలై 11 న నరసరావుపేట లో జన్మించారు. ఎస్.ఎస్‌.ఎల్‌.సి. వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుండి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినా నాటకరంగాన్నే ఆయన ఉపాధిగా ఎంచుకున్నారు. రంగస్థలంపై కృష్ణుడుగా, శివుడుగా, రామునిగా నటించడమే గాకుండా తన గాత్రమాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేవారు. రామదాసు, తుకారాం, సారంగధర వంటి ఎన్నో భిన్నమైన పాత్రలను నాటకరంగంపైనే ఆలవోకగా నటించి వాటికిజీవం పోశారు. ఆంగికం, వాచకం, అభినయం మూర్తీభవించిన వ్యక్తి సి.యస్.ఆర్. స్థానం నరసింహారావు తో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు - ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళ వయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించారు. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేశారు.  పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్‌గా, హాస్యనటుడిగా  విభిన్న పాత్రలకు జీవం పోశారు. ఈస్టిండియా ఫిల్మ్‌ కంపెనీ 1933లో నిర్మించిన రామదాసులో ఆయనే హీరో. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936)లో శ్రీకృష్ణునిగా నటించారు. సారథీ వారి గృహప్రవేశం (1946) చిత్రం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఎల్.వి.ప్రసాద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో కామెడీ విలన్‌ పాత్రలో ఆయన నటించారు అని చెప్పే కన్నా జీవించారని చెప్పడమే సబబు. మైడియర్‌ తులసమ్మక్కా అంటూ అక్కను బుట్టలో వేసుకునే పాత్రలో ఆయన నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది. జీవితం చిత్రంలో ఆయన నోట పలికించిన ఆ కాలంలో నేను కాలేజి చదువుకునే రోజుల్లో అనే డైలాగ్‌ అప్పట్లో అందరి నోట్లో తారకమంత్రలా నానుతుండేది. మధ్య వయస్సుల నుండి వృద్ధుల వరకూ ఎవరిని కదిపినా ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అంటుండే వారు. జగదేకవీరుని కథలో హే రాజన్‌ శృంగార వీరన్‌ అంటూ సీఎస్స్‌ఆర్‌ చెప్పిన డైలాగ్‌లు, రాజనాలతో కలిసి ఆయన పండించిన కామెడీ మరచిపోవడం సాధ్యం కాదు. విజయావారి నవ్వుల హరివిల్లు అప్పుచేసి పప్పుకూడులో సీఎస్సార్‌ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. వెయ్యి రూపాయిలు కావాలంటే పది మంది దగ్గరా పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గిరే అప్పుతీసుకో. వడ్డీ తీరిస్తే సరి. అసలు చెల్లించినప్పటి మాట కదా అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు పడీపడీ నవ్విస్తాయి.

సీయస్సార్‌ నటజీవితంలో మరో మైలు రాయి మాయాబజార్‌ లోని శకుని పాత్ర. ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది వంటి డైలాగులు ఆయన నటనా ప్రతిభకు అద్ధంపడతాయి. కన్యాశుల్కం లో రామప్ప పంతులుగా, ఇల్లరికంలో మేనేజరు గా, జయం మనదేలో మతిమరుపు రాజుగా, కన్యాదానంలో పెళ్ళిళ్ల పేరయ్యగా, ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. నటుడిగా ఎంతో పేరుతెచ్చుకున్న సీయస్సార్‌ దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారు. మూడు చిత్రాలకు దర్శకత్వం చేపట్టి కారణాంతరాల వల్ల వాటిని పూర్తిచేయలేకపోయారు. తన జీవితకాలమంతా కళాసేవకే అంకితమైన సీఎస్సార్‌ అక్టోబరు 8,1963 న చెన్నైలో కన్నుమూశారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన పాత్రలు నేటికీ సజీవంగానే నిలిచిపోయాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)