రక్తం గడ్డకట్టే ముప్పులేదు

Telugu Lo Computer
0


ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్నవారిలో అదనంగా రక్తం గడ్డకట్టే ముప్పు ఉండదని బ్రిటన్‌కు చెందిన ఔషధ, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్‌ఆర్‌ఏ) ధ్రువీకరించింది. భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఈ టీకాను తయారు చేస్తోంది. ఆస్ట్రాజెనెకా తొలిడోసు వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో స్వల్పంగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం (థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో కూడిన థ్రోంబోసిస్‌-టీటీఎస్‌) తలెత్తుతున్నట్టు గుర్తించారు. దీంతో పలు దేశాలు ఈ టీకా వినియోగంపై వెనకడుగు వేస్తున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించిన ఎంహెచ్‌ఆర్‌ఏ తొలి, మలి డోసు తీసుకున్న ఎంతమందిలో టీటీఎస్‌ తలెత్తుతోందన్న దానిపై అధ్యయనం సాగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఔషధాలు, టీకాల కారణంగా ఎంతమందిలో టీటీఎస్‌ తలెత్తుతోందన్న ఆరోగ్య భద్రత వివరాలను విశ్లేషించింది. ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తీసుకున్న 10 లక్షల మందిలో 8.1 మందికి వ్యాక్సిన్‌ కారక థ్రోంబోటిక్‌ థ్రోంబోసైటోపెనియా తలెత్తగా, రెండో డోసు తీసుకున్నవారిలో 2.3 మందిలోనే ఈ సమస్య అత్యంత స్వల్పంగా కనిపిస్తున్నట్టు గుర్తించింది. ''మా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత టీటీఎస్‌ సంభవించేందుకు నిర్దిష్ట కారణాలేవీ లేవు. అయినా, దుష్ప్రభావాలకు సంబంధించి మా పరిశోధనలు కొనసాగుతాయి. ఒకవేళ ఎవరిలోనైనా రక్తం గడ్డకట్టే పరిస్థితి తలెత్తితే తక్షణ చికిత్సతో దాన్ని అధిగమించవచ్చు'' అని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు 80కు పైగా దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)