బలివాడ కాంతారావు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మడపాం అనే గ్రామంలో సూర్యనారాయణ, రవణమ్మ దంపతులకు 1927 జూలై 3 న జన్మించారు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశారు. 38 దాకా నవలలు రాశారు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించారు. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆయనకి తెలుగు, ఇంగ్లీషే కాక బెంగాలీ, ఒరియా కూడా వచ్చు. బలివాడ కథలన్నీ 'చదువు-ఆగు-ఆలోచించు-సాగు ' అన్న మిత్రసమ్మితంగా, ఆత్మీయంగా పాఠకులని స్వాగతిస్తాయి, వారి సంస్కారోన్నతికి దోహదం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, కాంతారావుగారి కథాశిల్పంలో అత్యంత విలువైన గుణం నిరాడంబరత. కథలో వెల్లడి చేయనక్కరలేని దాన్ని పాఠకులకి వదిలేసి, వెల్లడి చేసినదానికి సంభావ్యతని, ఔచిత్యాన్ని సిద్ధింపచేస్తాయి. 2000 మే 06 న మరణించారు.
ఈయన రచన దగాపడిన తమ్ముడు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అన్ని భారతీయ భాషలలోకీ విడుదల చేసారు.1972లో పుణ్యభూమీ నవలకు అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది
1986లో వంశధార నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు లభించాయి.
సాహిత్యంలో కాంతారావు గారు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో గోపీచంద్ అవార్డు
1993లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.
1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం,రావి శాస్త్రి స్మారక పురస్కారం
1998లో విశాలంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన బలివాడ కాంతారావు కథలు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాలలో వీరిని సత్కరించాయి.బలివాడ కాంతారావు గారి రచనలపై ముగ్గురు సింద్ధాంత వ్యాసాలను రాసి పి.హెచ్.డి. డిగ్రీలు,కొందరు ఎం.పి.ఎల్ డిగ్రీలు సంపాదించారు.