డాక్టర్ పాణంగిపల్లి వేణుగోపాల్

Telugu Lo Computer
0


డాక్టర్  పాణంగిపల్లి వేణుగోపాల్ 1942 జూలై 7 న రాజమండ్రి లోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. వైద్యవిద్యలో 1959లో ఢిల్లీలో అడుగుపెట్టారు.  1963లో ఎం.బి., బి.ఎస్. చదవడానికి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో చేరారు. 1967లో చండీఘర్ వైద్య విజ్ఞాన సంస్థలో శస్త్రచికిత్సలో ఎమ్.ఎస్. చేశారు. అందులో సర్వ ప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు. ఎం.సి.హెచ్. పూర్తి చేసారు. 1970లో కార్డియాక్ సర్జరీలో స్పెషలైజేషన్ పూర్తిచేసారు.అనంతరం కొంతకాలం అమెరికా వెళ్ళి ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు డెంటన్ కూలేతో కలసి పనిచేసారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో 1971 లో చేరారు. 1972-74 మధ్య టెక్సాస్లో విశేష శిక్షణ పొందారు. వీరు 1992 నుండి కార్డియో థొరాసిక్ విభాగం అధిపతి. 1992 నుండి కార్డియోథొరాసిక్ లో గాఢ అధ్యయనం, పరిశోధనలు నిర్వహించారు. అప్పటి నుండి అంచెలంచెలుగా ఎదిగి గుండె శస్త్రచికిత్స విభాగానికి అధిపతిగా చాలాకాలంగా పనిచేసారు. ఇక్కడ సంవత్సరానికి మూడు వేల గుండె ఆపరేషన్లు నిర్వహించబడుతున్నాయి. మొదటి మూడు దశాబ్దాలలో 25 వేల ఓపెన్ హార్ట్ సర్జరీలు, 10 వేల క్లోజ్డ్ హార్ట్ సర్జరీలు చేశారు. ఇంచుమించు తొంభై మంది కార్డియో థొరాసిక్ సర్జన్లకు తర్ఫీదు ఇచ్చారు. 1997లో భారత రాష్ట్రపతికి గౌరవ హృద్రోగ నిపుణులుగా నియమించబడ్డారు. కొంతకాలం హాస్పిటల్ డీన్ గా పనిచేసారు.

వైద్యంలో ముఖ్యంగా హృద్రోగాల నిదానంలో ఈయన ఒక అసాధారణ నిపుణులు. మౌలిక ప్రతిభ ఉన్న పరిశోధకులు. మన దేశంలో మొట్టమొదటి గుండెమార్పిడి శస్త్రచికిత్స చేసింది ఈయనే. 1994 లో దేవీరాం (ఒక మోటార్ మెకానిక్) కు అరుదైన శస్త్రచికిత్స చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దేశంలో తొలిసారిగా ఈ అసాధారణ వైద్య విజయాన్ని సాధించారు.శస్త్ర చికిత్సకు పట్టిన సమయం 104 నిమిషాలు.

1970లో ఎయిమ్స్ లో చేరినప్పటి నుండి ఏ ఆపరేషన్ థియేటర్ లో, ఏ టేబుల్ మీదనయితే వేలాది మంది హృద్రోగులకు ఈయన శస్త్ర చికిత్స చేసారో, అదే టేబుల్ మీద ఈయనకు కూడా బైపాస్ సర్జరీ జరిగింది. మన దేశంలో కూడా ఎంత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానమున్నా, ఎందుకో తెలియని అభద్రతాభావంతో కొట్టుమిట్టాడేవారెందరో ఉన్న పరిస్థితులలో ఈయన విదేశాలకు వెళ్ళకుండా తన విద్యార్థి చేతనే శస్త్రచికిత్స చేయించుకున్నారు. తనను మామూలు రోగిగానే పరిగణించాలని చెబుతూ, కేవలం అయిదేళ్ళ అనుభవం ఉన్న డాక్టర్ ఎ.కె.చిసోయిని టీమ్‌ నాయకుడిగా ఉంచి, రోజు తనతో కలసి ఆపరేషన్ లు నిర్వహించే వైద్య బృందంతోనే 2005, జనవరిలో చికిత్స చేయించుకున్నారు. ఇది జరిగిన పదో రోజున యథావిధిగా తమ విధులకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాదు, పన్నెండో రోజున ఈయన స్వయంగా ఒక శస్త్రచికిత్స కూడా చేసారు.

మనం చేసే ప్రతి పనీ నమ్మకం మీద ఆధారపడుతుంది.

లక్షలాదిమంది చికిత్స కోసం రోజూ ఇక్కడికి వస్తూంటారు.

వారందరి ప్రాణాలకు ఉన్న భద్రత నా ఒక్కడికి ఉండదా?

అందుకే నేను సైతం అక్కడే ఆపరేషన్ చేయించుకోవాలని

నిశ్చయించుకున్నాను.

హృద్రోగాలకు "మూలకణాలు" చికిత్స ఈయన పరిశోధనా ప్రతిభ ఫలితమే. ఎముకల మజ్జలో (బోన్ మారో) మూలకణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ దృష్ట్యా వీటిని గుండెలోకి ఇంజక్ట్ చేసినప్పుడు అవి గుండె కండర కణాలుగా రూపొందుతాయి. శల్యమైన హృదయభాగాన్ని పునరుద్ధరిస్తాయి. ఈయన పరిశోధనా ఫలితాలు విజయవంతం కావడంతో ఎయిమ్స్ వైద్యులు సాంప్రదాయక చికిత్సతో పాటు స్టెమ్‌ సెల్ చికిత్సను కూడా వినియోగిస్తున్నారు. హృద్రోగాల చికిత్సలో ప్రత్యామ్నాయ పద్ధతుల అన్వేషణ క్రమంలో ఈ అధునాతన చికిత్సా విషయమై ఈయన పరిశోధనలు ప్రారంభించారు. మూలకణాలను అస్థి మజ్జి నుండి తీసుకుంటారు. బొడ్డు తాడులోని మూలకణాలను ఘనీభవింపచేసి, ఎవరికైనా 50 సంవత్సరాల పైబడిన వయస్సులో జన్యు సంబంధమైన వ్యాధులు నివారణకు ఉపయోగించుకోవచ్చు.

2003 ఫిబ్రవరి నుండి 2005 జనవరి వరకు ఈయన జరిపిన పరిశోధనలలో భాగంగా 35మంది హృద్రోగులకు మూలకణాల చికిత్స చేయడం జరిగింది. 6 నెలలు, 12 నెలలు, 18 నెలలు వ్యవధిలో ఈ చికిత్స ఏ విధంగా పనిచేసిందీ నిశితంగా గమనించడం జరిగింది. ఈ చికిత్స చేయించుకున్న రోగులెవరూ మరణించలేదు. వారందరూ బైపాస్ సర్జరీ కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచలేని దశలో ఆస్పత్రిలో చేరినవారే.

డా. వేణుగోపాల్ ప్రత్యేక పరిశోధనల వలన, ప్రోధ్బలంతో "ఎయిమ్స్"లో జాతీయ మూలకణాల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వెలువడింది. దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో ఈ చికిత్స విషయమై జరిగే పరిశోధనలకు సమన్వయ పరిచేలా ఈ కేంద్ర స్థాపన ఆవశ్యకతను డా. వేణుగోపాల్ స్పష్టీకరించారు. స్టెం సెల్ చికిత్స చేయించుకున్నవారిలో ఆరునెలల్లో శల్యమైన హృదయ భాగంలో 56 శాతం మెరకు పరిస్థితి మెరుగయిందనీ, 18 నెలలలో అది 64 శాతానికి పెరిగిందని ఈయన తెలిపారు. చాలా మంది హృద్రోగులకు గుండె మార్పిడే ఏకైక పరిష్కార మార్గంగా ఉన్న దశలోనే నిపుణులను సంప్రదించడం జరుగుతుందని, స్టెమ్ సెల్ చికిత్సలో గుండె మార్పిడి చేయించుకోవలసిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశముందని ఈయన ప్రకటించారు.

హృద్రోగాలతో సాంప్రదాయిక వైద్య శస్త్రచికిత్సా పద్ధతులు సత్ఫలితాలు యివ్వవని మూలకణాల చికిత్స ద్వారానే గుండె కండరాల పరిస్థితి మెరుగుపడుతుందని ఈయన తెలిపారు. రాష్ట్రపతి కలాం ఢిల్లోలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఈ చికిత్సా పద్ధతి చాలా అధునాతమైందని, ప్రపంచంలో అతి కొద్దిమందికి మాత్రమే ఈ చికిత్స జరిగిందని, భారత్ లో ఇదే మొదటిసారని తెలుపుతూ, వివిధ హృద్రోగాలతో బాధ పడుతున్నవారికి స్టెం సెల్ థెరపీ ఒక ఆశాదీపమని పేర్కొని, డా. వేణుగోపాల్ పరిశోధనలను ప్రస్తుతించారు.

పదవీవిరమణ చేసిన తదుపరి వేణుగోపాల్ హర్యానా రాష్ట్రంలోని గుర్గాన్ లో ఆల్‌కెమిస్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కార్డియాలజీ విభాగాధిపతిగా చేరారు. ఆయన తన 55వ యేట వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)