నకిలీ పోలీసులు అరెస్ట్
July 14, 2021
0
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా, వత్సవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామ శివారులో ఐదుగురు వ్యక్తులు షణ్ముఖసాయి అనే అక్రమ మద్యం వ్యాపారిని అడ్డగించి, తాము పోలీసులమని బెదిరించి అతని వద్దనుంచి 50 మద్యం సీసాలు, ఫోన్ పే ద్వారా ఏడు వేల రూపాయల నగదు బదిలీ చేయించుకుని వదిలి పెట్టారు. అనంతరం షణ్ముఖసాయి తన వద్ద మిగిలిన 50 మద్యం సీసాలతో గ్రామానికి బయలుదేరాడు. గ్రామానికి వస్తుండగా స్ధానిక వత్సవాయి ఎస్సై తనిఖీలు చేపట్టారు. షణ్ముఖసాయిని తనిఖీ చేయగా 50 మద్యంసీసాలు బయటపడ్డాయి. ఇప్పుడే కదా మీ వాళ్లకు డబ్బులు మద్యం ఇచ్చాను మళ్లీ అడ్డుకున్నారేంటని షణ్ముఖసాయి అనటంతో, కంగు తిన్న ఎస్సై మొత్తం వివరాలు తెలుసుకున్నారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం నిందితులు ఐదుగురు పండగ నాగార్జున, నిమ్మకాయల చందు, షేక్ హుస్సేన్, బంక వెంకటరావు, సత్య ప్రసాద్ లను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.