టికెట్‌ ధర పెంపు పేదలకు భారం !

Telugu Lo Computer
0


సాధారణ ప్రయాణికులపై రెట్టింపు భారాన్ని మోపింది దక్షిణ మధ్య రైల్వే. ప్యాసింజర్‌ రైళ్లను ఈ నెల 19 నుంచి ‘అన్‌రిజర్వుడ్‌ ఎక్స్‌ప్రెస్‌’లుగా నడుపుతూ.. టికెట్‌ ధరను దాదాపుగా రెట్టింపు చేసింది. ఆ మేర ప్రయాణ సమయాన్ని మాత్రం

తగ్గించలేదు. కొన్ని రైళ్లకు కేవలం 5, 10 నిమిషాల ఊరట కల్పించింది. కొన్నింటికి ప్రయాణ సమయం పెరగడం విస్మయం కలిగించే అంశం. 

మరోవైపు రైళ్లు ఆగే స్టేషన్లని (హాల్ట్‌) సగానికి సగం తగ్గించి.. అందరికీ అందుబాటులో లేకుండా చేసింది. ఇప్పటికే ‘ప్రత్యేక’ రైళ్ల పేరుతో వృద్ధులు, దివ్యాంగులు సహా వివిధవర్గాల వారికి రాయితీలను ఎత్తేసిన రైల్వేశాఖ.. ఇప్పుడు ప్యాసింజర్‌ రైళ్లలో ప్రయాణానికీ వ్యయప్రయాసల్ని పెంచేయడం గమనార్హం.

సామాన్యుల కష్టాలు

గ్రామాలు, చిన్న పట్టణాల నుంచి దగ్గరలోని పెద్ద పట్టణాలు, నగరాలకు ఉపాధికి, వివిధ అవసరాలకు నిత్యం పెద్దసంఖ్యలో ప్రజలు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. నగరాలు, పట్టణాల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేసేవారు కూడా అక్కడ అద్దెలు, ఖర్చులు భరించలేక సమీపాల్లోని సొంతూర్ల నుంచి నిత్యం రైళ్లలో కార్యాలయాలకు వస్తుంటారు. వీరందరిపైనా ఇప్పుడు అదనపు భారం పడింది. ‘‘ఛార్జీలు పెంచినా.. సమయం తగ్గకపోవడం, హాల్ట్‌లు తగ్గించడం బాధాకరమని’’ పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

★కాచిగూడ-మహబూబ్‌నగర్‌, కాచిగూడ-కరీంనగర్‌, కాచిగూడ-రాయచూరు, ఆదిలాబాద్‌-పర్లి, సికింద్రాబాద్‌-కళబురిగి(గుల్బర్గా) ప్యాసింజర్‌ రైళ్ల పాత, కొత్త సమయాల్లో ఎలాంటి మార్పులేదు.

★కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌ ప్యాసింజర్‌ గతంలో ఉదయం 5.25కి బయల్దేరి 9.30కి గమ్యం చేరేది. ఇప్పుడు 5.20కి బయల్దేరి 9.40కి చేరుతుంది. 15 నిమిషాల ప్రయాణ సమయం పెరిగింది.  

★సికింద్రాబాద్‌-మనోహరాబాద్‌ రైలు ఉదయం 6.10కి బదులు 5.45కి బయల్దేరినా ప్రయాణ సమయంలో మార్పులేదు.

★హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని పూర్ణా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆరేడు గంటల్లో చేరుతున్నాయి. ప్యాసింజర్‌ రైలును ఎక్స్‌ప్రెస్‌గా మార్చి రూ.80 ఛార్జిని రూ.150 చేసిన ద.మ.రైల్వే.. వెళ్లేటప్పుడు ప్రయాణ సమయాన్ని 35 నిమిషాలు తగ్గించింది. తిరుగు ప్రయాణంలో మాత్రం 40 నిమిషాలు పెంచింది.

★ఏపీ పరిధిలో మాత్రం విజయవాడ-గూడూరు రైలు 30 నిమిషాలు, కాకినాడ పోర్ట్‌- విజయవాడ రైలు ప్రయాణం 70 నిమిషాలు తగ్గాయి.

★కాజీపేట-సిర్పూర్‌టౌన్‌ ప్యాసింజర్‌ రైలుకు ఓదెల, కొత్తపల్లి, రాఘవాపురం, పెద్దంపేట, మందమర్రి సహా మరో స్టేషన్‌లో హాల్ట్‌ తీసేశారు. అంటే ఈ స్టేషన్లలో రైలు ఎక్కే ప్రయాణికులు ఇకపై మరో స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి.

★పొరుగునే ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేజోన్‌.. ప్యాసింజర్‌ రైళ్లలో కొన్నింటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి, మరికొన్నింటిని ప్యాసింజర్లుగా నడుపుతోంది. ద.మ.రైల్వే మాత్రం ప్యాసింజర్‌ రైళ్లన్నింటినీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చడం గమనార్హం.

టికెట్‌ ధరల పెంపు ఇలా..

★సికింద్రాబాద్‌-మనోహరాబాద్‌ మధ్య ఛార్జీ రూ.10 నుంచి రూ.30కి పెరిగింది. 14 చోట్ల ఆగే రైలుని 5 స్టేషన్లకే పరిమితం చేశారు.  

★కాచిగూడ-రాయచూరు టికెట్‌ ధర రూ.50 నుంచి రూ.80కి పెరిగింది. ఆగే స్టేషన్లను 20 నుంచి 12కి తగ్గించారు.  

★విజయవాడ-రాజమహేంద్రవరం ఛార్జి రూ.35 నుంచి రూ.65కి పెరిగింది. స్టేషన్లను 23 నుంచి 12కి పరిమితం చేశారు.

★విజయవాడ-డోర్నకల్‌ ఛార్జి రూ.30 నుంచి రూ.60కి పెరిగింది. నాగల్‌వంచ స్టేషన్‌ హాల్ట్‌ తీసేశారు.

★సికింద్రాబాద్‌-చిత్తాపూర్‌ ఛార్జి రూ.35 నుంచి రూ.70కి పెరిగింది. రావులపల్లి కలాన్‌, మైలారం హాల్ట్‌లు తొలగించారు.

★కాచిగూడ-మహబూబ్‌నగర్‌ ఛార్జి రూ.25 నుంచి రూ.50కి పెరిగింది. ఆగే స్టేషన్లను 15 నుంచి 6కి తగ్గించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)