ప్రైవేట్ వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలను తగ్గించలేమని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక విఢుదల చేసింది. తమకు నష్టాలొస్తున్నప్పటికీ, ఇప్పటికే తక్కువ ధరకే కేంద్రానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని, ఆ నష్టాలను కొంత వరకు భర్తీ చేసుకోవడానికి ప్రైవేట్ వారికి ఆ ధరకి అమ్మవలసి వస్తుందని చెప్పింది.
కేంద్రానికి ఒక వ్యాక్సిన్ డోసును కేవలం రూ.150లకే అందిస్తున్నామని, అందువలనే ప్రైవేట్ వారికి ఎక్కువకు ఇవ్వాల్సి వస్తుందని కోవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటెక్ చెప్పింది. ఎక్కువ కాలం ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ ను సరఫరా చేయలేమని పేర్కొంది. తమ ఉత్పత్తిలో 10శాతం కంటే తక్కువే ప్రైవేట్ ఆస్పత్రులకు ఇస్తున్నామని, మిగిలిన వాటిని రాష్ట్రానికి, కేంద్రానికి సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగానికి సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను తగ్గించలేమని భారత్ బయోటెక్ తేల్చి చెప్పింది. నష్టాలను పూడ్చుకునేందుకే ప్రైవేటులో ఈ ధరలను అమలు చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది.