ఎమ్మెస్ విశ్వనాథన్ !

Telugu Lo Computer
0


ఎమ్మెస్ విశ్వనాథన్ (జూన్ 24, 1928 - జూలై 14, 2015) దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకులు. తెలుగు, తమిళ, మలయాళం మొదలైన భాషల్లో దాదాపు పన్నెండువందల సినిమాలకు సంగీతాన్ని అందించారు. 14 జూలై 2015న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.

విశ్వనాథన్ కేరళ రాష్ట్రంలో పాలక్కాడ్ తాలూకాలో ఎలప్పళి గ్రామంలో సుబ్రమణియణ్, నారాయణి కుట్టి లకు జూన్ 24, 1928 తేదీన జన్మించారు. మూడేళ్ల వయసులోనే తండ్రి, సుబ్రమణియణ్ చనిపోతే, దక్షిణ కణ్ణనూరులో ఉన్న తాతగారి వద్ద పెరిగారు. తాతగారు ఆ ఊళ్లో జైలు వార్డెన్. నీలకంఠ భాగవతార్ గారి దగ్గర మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకున్నారు. పదమూడేళ్ల వయసులోనే మూడు గంటల పాటు నిర్విరామంగా సంగీత కచేరి చేసి అందరి ప్రశంసలు పొందారు. జైలు డే రోజు ఖైదీలతో "హరిశ్చంద్ర" నాటకం వేయించారు, అందులో లోహితాస్యునిగా విశ్వనాధన్ అదరగొట్టేశారు. దానితో ఖైదీలందరూ సినిమాలలో ప్రయత్నించు అని ప్రోత్సహించారు. అది 1941వ సంవత్సరం. ఆ రోజు విజయదశమి, మద్రాసులో తొలిసారి పాదం మోపాడు విశ్వనాధన్. మేనమామ సహాయంతో, జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎమ్.సుందరం చెట్టియార్, మొహిద్దీన్ లను కలిశారు. న్యూటోన్ స్టూడియాలో మేకప్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నీవు పనికిరావు, మళ్ళీ తర్వాత చూద్దాం అని చెప్పగా, వెళ్లిపోయారు. అదే నిర్మాతలను కలిసి, అక్కడే ఆఫీస్ బాయ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. ఓ పక్క ఆఫీస్ బాయ్ గా చేస్తూనే మరో పక్క జూపిటర్ సంస్థ తీసిన "కుబేర కుచేల" సినిమాలో సేవకునిగా చిన్న వేషం వేశారు. నటుడు కావడానికి తన ఆకారము, పర్సనాలిటి సరిపోదని తనకే అర్ధమైపోయింది. అందుకే సంగీత విభాగంలొనే కృషి చేసి పైకి రావాలని నిర్ణయించుకున్నారు. సేలంలో మోడ్రన్ థియేటర్స్ అనే సంస్థ ఉంది. అక్కడ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ ఉన్నారని తెలుసుకొని వెళ్లి కలిశారు. విశ్వనాధన్ తో ఓ పాట పాడించుకున్నారు మహాదేవన్ గారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా, ఆ ఒక్క పాట తోనే విశ్వనాధన్ లోని ప్రతిభని గుర్తించారు మహాదేవన్. నువ్వు సరాసరి సెంట్రల్ స్టూడియోకి వెళ్లు అక్కడ పని దొరుకుతుంది అని చెప్పారు. సెంట్రల్ స్టూడియోలో ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకునిగా ఉన్నారు. ఆ ట్రూపులో హార్మోనిస్ట్ గా చేరారు. అక్కడే "రామమూర్తి" (తిరుచారాపల్లి కృష్ణస్వామి రామమూర్తి) తో స్నేహం ఏర్పడింది. అలా చాలా రోజులు సుబ్బరామన్ దగ్గర సహాయకునిగా పనిచేశారు .  సుబ్బరామన్ దగ్గర ఉన్నప్పుడే ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తి, టి.జి.లింగప్ప, గోవర్ధనం పరిచయమయ్యారు.

ఇలా కొద్ది రోజులు గడిచాక ఎమ్జీఅర్ హీరోగా "జనోవా" అనే సినిమాకి సంగీత దర్శకత్వం చేసే అవకాశం విశ్వనాధన్ కు వచ్చింది. ఒకే రోజు నాలుగు పాటలు చేశారు. అవి సాయంత్రం సుబ్బరామన్ కు వినిపిద్దామని అనుకున్నారు. కాని ఈలోపే వినకూడదని అనుకున్న వార్త వినాల్సి వచ్చింది, సుబ్బరామన్ చనిపోయారు అని. అప్పటికే సుబ్బరామన్ చేతిలో ఏడు సినిమాల దాకా ఉన్నాయి. వాటిని విశ్వనాధన్ - రామమూర్తిలు కలిసి పూర్తిచేసారు. అప్పటికే సుబ్బరామన్ దేవదాసు సినిమాకి 7 పాటలకు బాణీలు చేశారు. మిగిలిన రెండు పాటలు "జగమే మాయ బ్రతుకే మాయ", బాలసరస్వతి పాడిన "ఇంత తెలిసియుండి" అనే  పాటలను కూడా స్వరపరిచారు. ఇలా సుబ్బరామన్ ఒప్పుకున్న తెలుగు, తమిళం చిత్రాలను ఎంతో చిత్తశుద్ధితో సకాలంలో పూర్తి చేశారు. ఇక ఆ తరువాత వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాలకు కలిసి సంగీత దర్శకత్వం చేశారు. 1965 లో కొన్ని కారణాల రీత్యా ఇద్దరూ విడివిడిగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 30 ఏళ్లు ఇద్దరూ కలుసుకోలేదు. ఆ తర్వాత విశ్వనాధన్ సోలోగా 700 సినిమాలకు (తమిళం 510, మలయాళం -76, కన్నడం - 3, తెలుగులో 70) పైగా స్వర సారథ్యం వహించారు. నాలాగ ఎందరో చిత్రానికి 1978 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకు  ఉత్తమ సంగీత దర్శకులుగా నంది అవార్డు లేచి సత్కరించింది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)