వేలంలో కొన్నాం .. సగం ధరకే !

Telugu Lo Computer
0

 

ఆర్టీఏ, పోలీసులు, బ్యాంకులు సీజ్‌ చేస్తే.. వాటిని వేలంలో కొనుగోలు చేసి మీకు తక్కువకు విక్రయిస్తున్నామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తారు. ధ్రువీకరణ పత్రాలను తర్వాత తెచ్చి ఇస్తామంటూ యజమానులకు తెలియకుండానే ‘సగం ధర’కు వారి ఖరీదైన కార్లను అమ్మేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇలా ఏకంగా 67 కార్లను విక్రయించిన ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. 13 మినహా మిగిలిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ సోమవారం మీడియాకు వెల్లడించారు.

మొత్తం 272 కార్లు.. కార్లను అద్దెకు తీసుకుని తమకు తెలియకుండానే ఇతరులకు విక్రయిస్తున్నారంటూ ఆర్సీపురం ఠాణాలో ఫిర్యాదులు అందడంతో సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్సీపురం ఎస్‌ఎన్‌ కాలనీకి చెందిన పల్లే నరేష్‌ కుమార్‌ అలియాస్‌ నరేష్‌ యాదవ్‌ (36)ను ప్రధాన సూత్రధారిగా తేల్చారు. అతనికి సహకరించిన రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ పూసలతండాకు చెందిన బాదావత్‌ రాజునాయక్‌ (31), కూకట్‌పల్లి నిజాంపేట వాసులు కలౌముల వికాస్‌ (21), గొల్లె భరత్‌ జోషి (23), ఓల్డ్‌ బోయిన్‌పల్లి స్వరధామ నగర్‌ వాసి భానూరి ఎలక్షన్‌రెడ్డి (35), ఫరూక్‌నగర్‌ కంసాన్‌పల్లికి చెందిన తాళ్ల నరసింహ గౌడ్‌ (30)ను అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా మొత్తం 272 ఖరీదైన కార్లను అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. వీటిలో 205 కార్లను యజమానులు జీపీఎస్‌ ట్రాకర్‌ సాయంతో ఎక్కడున్నాయో తెలుసుకుని, అక్కడికెళ్లి మారు తాళంతో తెచ్చుకున్నట్లు తేల్చారు. మిగిలిన 67 కార్ల (విలువ రూ.4.39 కోట్లు)ను రూ.1.91 కోట్లకు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది.

పనిచేసే చోట గమనించి.. ప్రధాన నిందితుడు నరేష్‌ జేఎన్‌టీయూ(హెచ్‌) నుంచి ఎంటెక్‌ పట్టా పొందాడు. చేవెళ్లలోని ఓ ప్రైవేటు సంస్థలో మూడేళ్లు పనిచేశాడు. ఆ క్రమంలోనే కంపెనీ కార్లను అద్దెకు తీసుకోవడం గమనించాడు. స్థానికులు, ట్రావెల్స్‌ ఏజెన్సీల నిర్వాహకులను సంప్రందించి కార్లు ఊరికే ఇంట్లో పెట్టుకోవడం కంటే తనకు అద్దెకిస్తే దండిగా చెల్లిస్తానంటూ నమ్మించేవాడు. ఒకటి, రెండు నెలలు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించేవాడు. ఆ తర్వాత కార్లను విక్రయించే బాధ్యతను మిగిలిన నిందితులకు అప్పగించేవాడు. ఆ డబ్బులతో జల్సా చేసేవారు. రాజు నాయక్‌ ఎంఎస్‌డబ్ల్యూ పూర్తి చేశాడు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాడు. నర్సింహులు గౌడ్‌ అనే స్నేహితుడి ద్వారా ప్రధాన నిందితుడితో పరిచయం ఏర్పడింది. 28 కార్లను విక్రయిస్తానంటూ తీసుకుని 27 అమ్మాడు. ఒకటి తన దగ్గర పెట్టుకున్నాడు. బీటెక్‌ పూర్తి చేసిన వికాస్‌ 14 కార్లను తీసుకుని ఆరింటిని అమ్మాడు. మిగిలిన ఎనిమిదింటిని కుటుంబ సభ్యులకిచ్చాడు. బీటెక్‌ చదివిన గొల్లె భరత్‌ 14 కార్లలో 11 విక్రయించాడు. మూడింటిని కుటుంబ సభ్యులకు అందజేశాడు. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన భానూరి ఎలక్షన్‌రెడ్డి 15 కార్లలో 13 విక్రయించాడు. బీఏ చదివిన తాళ్ల నర్సింహులు వ్యవసాయం చేస్తుంటాడు. అతడు 6 కార్లు తీసుకుని ఒకటి తన వద్ద ఉంచుకుని మరో అయిదింటిని అమ్మేసినట్లు వీసీ సజ్జనార్‌ వివరించారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)