పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం మాల్దాలోని షేక్స్పియర్ ప్రాంతంలో నివసించే జావేద్ అలీ చిన్న కుమారుడు ఆసిఫ్ మెహబూబ్, అతడి కుటుంబానికి కాలయముడిగా మారాడు. తల్లిదండ్రులతోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను ఇంటర్ చదువుతున్న ఆసిఫ్ మెహబూబ్ అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి, తండ్రి, సోదరితో పాటు 62 ఏళ్ల వృద్ధురాలిని ఆసిఫ్ ఫిబ్రవరి 17న హత్య చేశాడు. అనంతరం సొంత ఇంటి ఆవరణలోనే వారిని పూడ్చిపెట్టాడు.
ఆసిఫ్ దాడి నుంచి తప్పించుకున్న అతడి సోదరుడు రాహుల్ షేక్ భయంతో ఇంతకాలం నోరు విప్పకపోవడంతో విషయం బయటకు పొక్కలేదు. అయితే ఆసిఫ్ అకృత్యాన్ని ఎట్టకేలకు బయటపెట్టాలని నిర్ణయించుకున్న రాహుల్.. కాలియాచోక్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించటంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత రాహుల్ షేక్ మాటలపై సందేహం వ్యక్తం చేసిన పోలీసులు.. అనంతరం ఆసిఫ్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆసిఫ్ నిత్యం తన తండ్రి జావెద్ను డబ్బులకోసం డిమాండ్ చేసేవాడని స్థానికులు పేర్కొన్నారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.