అల్లుడి బెదిరింపులు !

Telugu Lo Computer
0


తనకు ప్రాణహాని ఉందంటూ గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్, డైరెక్టర్ డాక్టర్ కంచర్ల రవీంద్రనాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము కోరుకున్న విధంగా ఆస్తి పంపకాలు చేయకపోతే అంతం చేస్తామంటూ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ను బెదిరించిన వ్యవహారంలో ఆయన అల్లుడు, వియ్యంకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లో ఉంటున్న డాక్టర్ రవీంద్రనాథ్‌కు ఇటీవల ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి. తన ఆస్తుల్లో సుమారు 70 శాతం గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్‌కు ఇస్తానని డాక్టర్ రవీంద్రనాథ్ చెప్పడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే కాలనీలో నివసించే అల్లుడు పొట్లపల్లి సూరజ్ తేజ్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ రవీంద్రనాథ్ ఇంటికి వచ్చి తాము చెప్పినట్లు ఆస్తులను సమానంగా పంచకపోతే అంతు చూస్తానని, తన వద్ద లైసెన్స్డ్ గన్ కూడా ఉందని, దానికి పని చెప్పమంటావా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని,  చెన్నైలో ఉంటున్న తన కుమారుడి మామ (వియ్యంకుడు) పరుచూరి రాజారావుతో చేతులు కలిపిన అల్లుడు సూరజ్ తేజ్ కొంత కాలంగా తన ఫోన్‌ను కూడా హ్యాక్ చేసి తన కదలికలను గమనిస్తున్నాడని, మూడో వ్యక్తికి తాను మాట్లాడుతున్న విషయాలను చేరవేస్తున్నారని డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ డాక్టర్ రవీంద్రనాథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు సూరజ్ తేజ్, వియ్యంకుడు రాజారావులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)