అప్పటి వారి వైభవమే వైభవము - ఇపుడు ఏది తిన్నా మధుమేహం వస్తుందేమో అని హడలి చచ్చే కాలం వచ్చింది గానీ అప్పట్లో సుష్టుగా తిని పుష్టిగా పెరిగి కష్టించి పని చేసి ఏ మాయరోగాలు లేకుండా జీవించారు .
కృష్ణరాయల కాలము నాటి వాడు, దూర్జటి మహాకవి శిష్యుడు అయిన కోట శివరామయ్య అనే కవి అప్పటి ఆహారపు అలవాట్లను గూర్చి ఎంత బాగా చెప్పారో తేట తెనుగులో . అందరూ అంటారు బ్రాహ్మణులకు తప్ప మిగతా వారు కవులు లేరని, వారికి విద్యాభ్యాసం ఉండేది కాదనిన్నీ..ఎందుకు లేరూ ఉన్నారు ఇతర వర్ణస్తులు విధ్యాధికులు అయినవారెందరో .. కానీ వారు వ్రాసిన వ్రాతలు లభ్యం కానందువల్ల చరిత్రలో ఉటంకించలేకపోయారు గానీ మన కావలి సోదరులు చెప్పిన ప్రకారము దాదాపు 20,000 తాళపత్ర ప్రతులు వారు గ్రామ గ్రామాల కు తిరిగి సేకరించినవి కనీసం ఆ అక్షరాలు కూడా గుర్తు పట్టని స్థితిలో ఉంటే వాటిని కలకత్తా మ్యూజియం కి తరలించామని . ఇది 1830 ల నాటి మాట. ఇపుడవి లభ్యమో కాదో మరి కానీ ఆధునిక పరిజ్ఞానం వినియోగించి వాటిని పరిష్కరిస్తే మరెన్ని తెలుగు కావ్యాలు లభ్యం అయ్యేవో మనకు.ఈ కోట శివరామయ్య శూద్రుడు అయిననూ దూర్జటి మహాకవి కుటుంబ సాంగత్యం చేత మంచి ప్రజ్ఞ గడించి తేట తెనుగులో సనందోపాఖ్యానం అనే గ్రంథం వ్రాశారు. అందలి పద్యం చూడండి.
"గారెలు బూరె లిడ్డెనలు గమ్మనిదోసెలు జక్కిలంబులున్
జారులు గూరలున్ ఫలరసంబులు దేనెలు బానకంబులున్
సారెలు బాయసాన్నములు జక్కెర లప్పడంబులున్
బేరిననేతులుం జెఱకుబిళ్ళలు జల్లనినీరుమజ్జిగల్"
ఆహా గారెలు, బూరెలు, ఇడ్డెనలు , కమ్మని దోసెలు , చక్కిలంబులు , చారు, కూరలు , ఫలరసాలు , పానకములు, పాయసాన్నములు , చక్కెర అప్పడాలు,(సారెసత్తులు) పేరిన నేయి , చెరకు బిళ్లలు, చల్లని నీరు మజ్జిగ.. ఇవన్నీ వింటుంటేనే నోరూరుతోందే.