జె.వి. సోమయాజులు

Telugu Lo Computer
0


జె.వి. సోమయాజులు  తెలుగుప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటులు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర వంటి మాధ్యమాలన్నింటిలో నటించారు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు.

జె.వి.సోమయజులు 1928 జూన్ 30 వ తెదీన శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావులు. ఈయన సోదరుడు చలన చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు జె.వి. రమణమూర్తి . ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు విజయంనగరంలో చదువుకొన్నప్పటి నుండి నాటకాలు వేసేవారు.  తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చారు.  ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్ప పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యారు.  సోమయాజులు తల్లి శారదాంబ అతనిని ప్రోత్సహించింది.

జె.వి.సోమయాజులు స్వయంకృషితో నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కుటుంబమంతా మొదటి ప్రపంచయుద్ధ ప్రభావంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినపుడు ఆయన వ్యధ చెందారు. క్విట్‌ ఇండియా ఉద్యమం (1942), భారత స్వాతంత్య్ర సంగ్రామం, మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సంక్షోభం వంటి వాటిని అర్థం చేసుకుంటూ, తాను నమ్మిన నాటకరంగాన్ని విస్మరించకుండా, నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు. వీరికి వేదుల జగన్నాథరావు అండదండలు లభించాయి. 1946 నుండి పెళ్ళిపిచ్చి, దొంగాటకం నాటక ప్రదర్శనల్ని ప్రారంభించారు. తర్వాత కన్యాశుల్కం నాటకం ఆడటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి ప్రదర్శన వేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పట్టింది. 1953 ఏప్రిల్‌ 20వ తేదీన కన్యాశుల్కం తొలి ప్రదర్శన ఇచ్చారు. సోమయాజులుతోపాటు రమణమూర్తి, బీరకాయల రామదాసు, ఎం.జోగారావు, వంకాయల వెంకట అప్పారావు, కర్రి పద్మనాభాచార్యులు, వేదుల నరసింహ, జె.వి.శ్రీరామమూర్తి, పోడూరి విశ్వేశ్వరరావు, ఐఎస్‌. రాజకుమారి. వి.వి.సుమిత్ర, యు.ఎస్‌.ఎన్‌.రాజు, ప్రేమనాథ్‌, వేణుగోపాలరావు, రావికొండలరావు, గరిమెళ్ళ రామమూర్తి వంటి ఎందరో కళాకారులు ఈ నాటకంలో భాగస్వాములయ్యారు. ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించి గంభీర స్వరంతో సహనటులందరికీ ఆదర్శంగా నిలిచారు సోమయాజులు. దీని తర్వాత ఆంధ్ర నాటక కళాపరిషత్తులో బహుమతులు గెలుచుకుని ప్రతిభను మరింత పదును పెట్టుకోవాలనే పట్టుదలతో మనిషిలో మనిషి, నాటకం, పంజరం, గాలివాన, కప్పలు లాంటి నాటకాలను తీర్చిదిద్ది పోటీలలో నిలిచారు. లక్ష్యాలను సాధించారు, కీర్తిని ఆర్జించారు. ఎన్నో బహుమతులు గెలుచు కున్నారు. రెవిన్యూశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఆయనకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన 'రాధాకృష్ణయ్య' సినిమాలో ఓ ముఖ్య పాత్రను ధరించారు. ఇది మంచి చిత్రంగా పేరుగాంచినా, ఆర్థికంగా విజయవంతం కాలేదు. అందుకే ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోలేదు. శంకరాభరణం సినిమాలోని శంకరశాస్త్రి పాత్ర ద్వారా ఆయన ఎంతో పేరు, ప్రఖ్యాతులు గడించారు. దీనితర్వాత 150 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ, ఇప్పటికీ సోమయాజులు గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం శంకరాభరణమే. త్యాగయ్య వంటి సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించినా, ఈ చిత్రం రాణింపుకు రాలేదు. అలాగే 'సప్తపది'కూడా ఆయన ప్రతిభకు గుర్తింపు తీసుకురాలేదు. 'వంశవృక్షం' సినిమాకూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. శంకరాభరణం విజయవంతమైన తర్వాత, రెవిన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన పరిశీలించి, సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్‌గా సోమయాజులును నియమించారు.1984లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం 55ఏళ్ళు నిండిన ప్రభుత్వోద్యోగులపై పదవీ విరమణ వేటు వేసింది. ఆ వేటుకి గాయపడిన వారిలో సోమయాజులు కూడా ఉన్నారు. రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన ఈ కళాకారుడిని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించింది. అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు అధిపతిగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే 1993 మార్చి 8వ తేదీన రసరంజని నాటక కళాసంస్థను నెలకొల్పారు. ప్రతిరోజూ నాటకాన్ని ప్రదర్శించాలనీ, టికెట్‌ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. హైదరాబాద్‌లో నాటకరంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. ఈ క్రమంలో జెవి సోమయాజులు అందించిన కంట్రిబ్యూషన్‌ చెప్పుకోదగింది.

శంకరాభరణం సినిమాలో "శంకరశాస్త్రి" పాత్రతో ప్రసిద్ధుడయ్యారు.  'వంశవృక్షం', 'త్యాగయ్య' చిత్రాల్లో బాపు దర్శకత్వంలో నటించడం కూడా జె.వి. సోమ యాజులుకు మరుపురాని అనుభూతినిచ్చింది. నన్ను త్యాగయ్య పాత్రకి, వంశవృక్షంలోని ఆ పాత్రకి బాపు రమణ ఎంపిక చేయడం కూడా నా పూర్వ జన్మ సుకృతమే అన్నాడాయన. త్యాగయ్య చిత్రం హిట్‌ కాకపోయినా ఆయనకు మట్టుకు మంచి నటుడిగా పేరొచ్చింది. 'సప్తపది', 'పెళ్ళీడు పిల్లలు', 'నెలవంక', 'సితార', 'స్వాతిముత్యం', 'దేవాలయం', 'కళ్యాణ తాంబూలం', 'ఆలాపన', 'మగధీరుడు', 'చక్రవర్తి', 'స్వయంకృషి', 'స్వరకల్పన', 'అప్పుల అప్పారావు', 'ఆదిత్య 369', 'అల్లరిమొగుడు', 'అభినందన', 'రౌడీ అల్లుడు', 'ముఠా మేస్త్రి', 'గోవిందా గోవిందా', 'సరిగమలు', 'కబీర్‌దాస్‌', 'భాగమతి' మొదలైన తెలుగు చిత్రాల్లోను, 'ఇదు నమ్మ ఆలు', 'ఒండగానబా.... శ్రీరాఘవేంద్ర' తమిళ చిత్రాల్లో, 'సోపానం' అనే మలయాళ చిత్రంలో, 'ప్యార్‌ కా సింధూర్‌', 'ప్రతిబంధ్' హిందీ చిత్రాల్లోనూ నటించారు.  టెలివిజన్ ప్రసారం కోసం కన్యాశుల్కాన్ని 13 భాగాల నాటకంగా రూపొందించారు. జంట నగరాలలో నాటక కళ ప్రోత్సాహానికి "రసరంజని" అనే సంస్థను గరిమెళ్ళ రామమూర్తి, చాట్ల శ్రీరాములు, రాళ్ళపల్లి వంటివారితో కలిసి స్థాపించారు. 

150 సినిమాల్లో నటించినా, టివి సీరియల్స్‌లో కూడా ఎన్నో పాత్రలు ధరించారు.  నాటక, సినిమా, టివి రంగాలకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన ఘనుడాయన. చివరి శ్వాసవరకు నటనమీద గౌరవంతో ఆరాధనాభావంతో జీవించారు. చివరి దశలో ఆరోగ్యం సహకరించకపోయినా చేయగలిగినంత చేశారు. కళాకారుడు కడవరకు కళాకారుడేనని సోదాహరణంగా నిరూపించారు. ఈయన రిటైరయ్యే నాటికి సాంస్కృతిక విభాగంలో డైరెక్టరుగా పనిచేసేవారు. 2004 ఏప్రిల్‌ 27వ తేదీన ఈ లోకంనుండి నిష్క్రమించారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)