ప్రధాన్ మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన పథకం కింద నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో 5 నెలల పాటు ఉచితంగా రేషన్ అందనుంది. లబ్దిదారులైన ప్రతి వ్యక్తికి రేషన్ షాపుల ద్వారా 5 కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వనున్నారు. దీని కోసం కేంద్రానికి రూ.64,031కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఐదు నెలలకుగాను సుమారు 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు. గతేడాది లాక్డౌన్ దృష్ట్యా గరీభ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా పేదలకు 8 నెలలు ఉచిత రేషన్ అందించారు. కరోనా సెకండ్ వేవ్లో ఈ ఏడాది మే, జూన్ వరకు అమలు చేశారు. కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా ప్రస్తుతం మరో ఐదు నెలలు పొడిగించారు.