ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారత్ కు రూ.113 కోట్లు అందిస్తామని గురువారం ప్రకటించింది. ముఖ్యంగా హెల్త్ వర్కర్లకు అదనపు శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లోఆరోగ్య సౌకర్యాల మెరుగు, 80 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. గివ్ ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులను అందించనుంది. ఈ రెండు సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తాయి. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ సహాయాన్ని అందిస్తాయి. సంబంధిత టార్గెట్ ఏరియాలను గుర్తించి, వాటిని సాంకేతిక సహాయాన్ని అందించడంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర అధికారులతో పని చేస్తుంది. అలాగే అపోలో మెడీ స్కిల్స్ ఇనీషియేటివ్తో కలిసి 20వేల మంది ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కోసం పెట్టుబడులు పెడుతుంది. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలకు, ఆరోగ్య వ్యవస్థలకు సహాయం చేయడమే లక్ష్యమని గూగుల్ వెల్లడించింది. దీంతోపాటు ఆశా, ఎఎన్ఎం వర్కర్ల శిక్షణా నిమిత్తం ఏకంగా రూ. 3.6 కోట్లు (5 లక్షల డాలర్లు) గ్రాంట్ను అందివ్వనుంది. తద్వారా 15 రాష్ట్రాలలో లక్షా 80వేల ఆశా వర్కర్లకు, 40వేల ఎఎన్ఎంలకు అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లను ఏర్పాటు చేయనుంది.
గివ్ ఇండియా సంస్థ సిఈఓ అతుల్ సతిజా మాట్లాడుతూ పాత్ సంస్థతో కలిసి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని కోసం పాత్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తుందని తెలిపారు. మూడు నుంచి ఆరు నెలల లోపు ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ అవసరాలతో పాటు భవిష్యత్ లో ఉపయోగపడేటట్లు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని పాటు సంస్థ డైరెక్టర్ నీరజ్ జైన్ తెలిపారు.