కోవిడ్-19 మహమ్మారి రెండో విడత ఒక పక్క దేశమంతటా విజృంభిస్తోంది. దేశ ఆరోగ్య వ్యవస్థనంతటినీ కోవిడ్ పై పోరుకు సిద్ధం చేయడంలో ముందుండాల్సిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హర్షవర్ధన్ ఏప్రిల్ మాసం మధ్యవారంలో వివిధ విభాగాల అధిపతులను సమావేశపరచి స్వదేశీ ఆవుల మీద పరిశోధనను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు !
'' స్వదేశీ ఆవులనుంచి వచ్చే ఉత్పత్తులు (?) శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఏ విధంగా మెరుగ్గా వినియోగించాలి '' అనేది ఆ ప్రాజెక్టుకు పేరు ! ఆవునుండి వచ్చే ఉత్పత్తులు ఏముంటాయి ? ఆవు పేడ, గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యి. ఈ ఐదింటినీ కలిపి ''పంచ గవ్య'' అని అంటారు.
అసలు ఇప్పటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేసివుంటే రెండో విడత కోవిడ్ తలెత్తగానే దేశంలో అందరికీ ఆయుష్ ప్రాజెక్టు ద్వారా ఇంత పేడ, ఆవు మూత్రం ఇచ్చి వాటిని పాలతో కలుపుకుని తాగమని ప్రచారం చేసివుండేవారేమో !
గుజరాత్ లో ఇప్పటికే ఈ పైత్యం బాగా తలకెక్కినట్టుంది. జనాలు గోశాలల దగ్గరికి పోయి వంటినిండా ఆవుపేడ, మూత్రం పులుముకుని వస్తున్నారు . పై విధంగా చేయడం వలన ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు డాక్టర్స్ ఆందోళన చెందుతున్నారు. దాంతో కరోనా దరి చేరదని నమ్ముతున్నారు. ఈరోజు కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి మూడు స్థానాల్లో ఉంది! అక్కడ మరణాల రేటు కూడా దేశంలోకెల్లా అత్యధికంగా ఉంది !
ఉత్తరప్రదేశ్ లో ప్రతీ జిల్లాలోనూ గో రక్షణకు హెల్ప్ డెస్క్ లు వెంటనే ఏర్పాటు చేయలని ఆదేశించాడు ! మరి జిల్లాల అధికారులంతా ఆ పనిలో ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకుంటారు? కరోనాతో మరణించిన వారి దేహాలకు అంత్యక్రియలు కూడా జరగనందువల్లనే అక్కడినుండి బీహార్ రాష్ట్రంలోకి గంగానది ద్వారా శవాలు కొట్టుకొస్తున్నాయి !