కరోనా మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఒక ఆందోళనకర విషయం బయటపెట్టింది. మరణాల లెక్కింపు సరిగ్గా జరగడం లేదని స్పష్టం చేసింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 30 లక్షల మంది చనిపోయి ఉంటారని అంచనా వేసింది. ఆయా దేశాలు వెల్లడించిన మరణాల లెక్కలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. ఇందుకు సంబంధించిన లెక్కలతో ఓ నివేదికను విడుదల చేసింది. 2020 డిసెంబర్ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8.2 కోట్లు, మృతుల సంఖ్య 18 లక్షలుగా ఉందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. చాలా దేశాల్లో పాజిటివ్ వచ్చిన తర్వాత మరణించిన వారినే లెక్కించారని నివేదికలో తెలిపింది. వ్యాధి నిర్ధారణ సరిగా జరగక ముందే చనిపోయినవారిని లెక్కలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది. అన్ని దేశాలు డేటా సేకరణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోవ్ స్పష్టం చేశారు.