ప్రస్తుతం కరోనా సోకకుండా నిరోధించేందుకు కొవాగ్జిన్ రెండు డోసులను ఇస్తున్నారు. రెండోడోస్ వేసుకున్న రెండువారాల తర్వాత శరీరంలో సంపూర్ణంగా ప్రతిరక్షకాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ప్రతిరక్షకాలు దాదాపు తొమ్మిది నెలలు మానవ శరీరంలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంటే.. కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ పొందాలంటే ఏటా టీకాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా భారం అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ ‘బూస్టర్ డోస్’ (మూడో డోస్) ప్రయోగాలు చేపట్టింది. రెండోడోస్ పూర్తయ్యాక మూడోడోస్ ఇస్తే ఏర్పడే ప్రతిరక్షకాలు జీవితాంతం ఉంటాయని భారత్ బయోటెక్ భావిస్తున్నది.
బూస్టర్ డోస్ ప్రయోగం కోసం సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్ఇసి) నుంచి భారత్ బయోటెక్ సంస్థ ఇప్పటికే అనుమతి పొందింది. ప్రయోగాలలో భాగంగా కోవాగ్జిన్ రోగ నిరోధక సామర్ఢ్యము, దుష్ప్రభావాలు, వ్యాక్సిన్ సురక్షితం తదితర అంశాలను అంచనా వేయనున్నారు.
190 మందికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఏడుగురు వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చారు. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో ప్రయోగాలు చేపడుతున్నట్టు భారత్ బయోటెక్వర్గాలు తెలిపాయి. 18-55 ఏళ్ల మధ్యవారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించాయి.